– అనర్హులకిస్తే ఊరుకునేది లేదు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లకిë
– సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ- సూర్యాపేట కలెక్టరేట్
దళితబంధు, బీసీబంధు, పింఛన్లు, మైనార్టీబంధు, గృహలక్ష్మీ, డబుల్ బెడ్ రూమ్ తదితర సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకే ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లకిë డిమాండ్ చేశారు. పేదలను పక్కనబెట్టి బీఆర్ఎస్ కార్యకర్తలకే పథకాలు అప్పగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సంక్షేమ పథకాలను అధికార పార్టీ కార్యకర్తలకే ఇవ్వడాన్ని నిరసిస్తూ సోమవారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట పెద్దఎత్తున ధర్నా చేశారు. నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్లోకి చొచ్చుకు పోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మెయిన్ గేటు వద్ద పోలీసులకు, సీపీఐ(ఎం) కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట, వాగ్వివాదం చోటుచేసుకుంది. పలువురు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ముఖ్య నాయకులను కలెక్టరేట్లోకి అనుమతించగా.. వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ వెంకట్రావుకు అందజేశారు.
అంతకుముందు మల్లు లకిë మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చే విధానాన్ని ప్రజాప్రతినిధులు మార్చుకోవాలని సూచించారు. అర్హులైన పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు వస్తే గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీల పెద్దలు కూర్చొని అర్హులైన నిరుపేదలను గుర్తించి.. వారికి వర్తింపజేసేవారని గుర్తు చేశారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంటెద్దు పోకడతో వ్యవహరిస్తోందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు, పారేపల్లి శేఖర్రావు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మీ, ప్రజాసంఘాల జిల్లా నాయకులు ములకలపల్లి రాములు, కాసాని కిషోర్, ఎం.రాంబాబు, కడెం లింగయ్య తదితరులు పాల్గొన్నారు.