– గ్రామస్తుల ఆందోళన.. సీపీఐ(ఎం), బీఆర్ఎస్ నాయకుల మద్దతు
నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలం కంసానిపల్లి గ్రామంలోని మెయిన్ రోడ్డు గుంతలమయంగా, వర్షం పడిన ప్రతిసారి బురదమయంగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. రహదారిపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్డు మొత్తం బురదమయంగా మారడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే రోడ్డు గుంతలను పూడ్చి, డస్ట్ పోసి చదును చేసి, శాశ్వత పరిష్కారంగా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. గ్రామస్తుల ఆందోళనకు సీపీఐ(ఎం), బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. రోడ్డు అధ్వానంగా మారినప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే రహదారి మరమ్మతులు చేపట్టి సీసీ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.



