నవతెలంగాణ – హైదరాబాద్ : లార్డ్స్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా పోరాడి ఓడింది. భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ, కెప్టెన్ శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించినా విజయం దక్కలేదు. 388 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 360 పరుగులు మాత్రమే చేసి 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లండ్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది.
భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అద్భుతమైన శుభారంభం ఇచ్చారు. ముఖ్యంగా రోహిత్ (110 బంతుల్లో 138; 17 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి అద్భుత శతకంతో అలరించాడు. అతనికి జతగా గిల్ (84 బంతుల్లో 77) కూడా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గెలుపుపై ఆశలు రేపారు. గిల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ (60 బంతుల్లో 74) కూడా దూకుడుగా ఆడాడు. రోహిత్తో కలిసి రెండో వికెట్కు 113 పరుగులు జోడించి స్కోరుబోర్డును నడిపించాడు.
కీలక సమయంలో రోహిత్..
బెతెల్ బౌలింగ్ లో ఔటవ్వడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. మ్యాచ్ ఇక్కడే మలుపు తిరిగింది. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ (14), శ్రేయస్ అయ్యర్ (0) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఈ దశలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ విజృంభించాడు. కీలకమైన కోహ్లీ వికెట్తో పాటు ఇషాన్, శ్రేయస్, అక్షర్ పటేల్లను ఔట్ చేసి భారత్ను కోలుకోలేని దెబ్బ తీశాడు. దీంతో గెలుపు దిశగా సాగుతున్న భారత్ ఒక్కసారిగా పీకల్లోతు కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్ (12) కూడా నిరాశపరిచాడు. చివర్లో గుర్నూర్ బ్రార్ (18*), అర్ష్దీప్ సింగ్ (15*) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో శామ్ కరన్ 4 వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ బెన్ డకెట్ (141) అద్భుత శతకంతో కదంతొక్కగా, మరో ఓపెనర్ జాకబ్ బెథెల్ (91) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 192 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. చివర్లో జో రూట్ (74*) అజేయంగా నిలవగా, జోస్ బట్లర్ (13 బంతుల్లో 41) ఆకాశమే హద్దుగా చెలరేగి జట్టు స్కోరును 380 పరుగులు దాటించాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు తీశాడు.



