– మూడు ప్రవేశ పరీక్షలకు మారిన కన్వీనర్లు
– ప్రకటించిన ఉన్నత విద్యామండలి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ సహా వివిధ వృత్తి విద్య, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్షలకు సంబంధించిన కన్వీనర్లను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ ఏడాది పీజీఈసెట్, ఐసెట్, ఎడ్సెట్ మూడు ప్రవేశ పరీక్షల కన్వీనర్లను మార్చింది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎప్సెట్ (ఎంసెట్) కన్వీనర్గా జేఎన్టీయూ హైదరాబాద్ ప్రొఫెసర్ బి డీన్కుమార్ను తిరిగి నియమించింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ కన్వీనర్గా కేయూ ప్రొఫెసర్ ఎస్ నర్సింహ్మాచారిని ఎంపిక చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, చైర్మెన్ ఆర్ లింబాద్రి కన్వీనర్ల పేర్లను శనివారం ప్రకటించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీజీఈసెట్ కన్వీనర్గా జేఎన్టీయూ హైదరాబాద్ ప్రొఫెసర్ ఎ అరుణకుమారిని నియమించామని తెలిపారు. లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈసెట్ కన్వీనర్గా ఓయూ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, లా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ కన్వీనర్గా ఓయూ ప్రొఫెసర్ బి విజయలక్ష్మి, బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈసెట్ కన్వీనర్గా శాతవాహన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రాజేష్కుమార్ను తిరిగి నియమించారు. బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ కన్వీనర్గా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ టి మృణాళినిని ఎంపిక చేశారు. ఇప్పటికే అన్ని ప్రవేశ పరీక్షలకు సంబంధించిన రాతపరీక్షల షెడ్యూల్ను ప్రకటించిన విషయం తెలిసిందే.
ప్రవేశ పరీక్షల కన్వీనర్ల వివరాలు
సెట్ విశ్వవిద్యాలయం కన్వీనర్ రాతపరీక్షల తేదీలు
ఎప్సెట్ జేఎన్టీయూహెచ్ బి డీన్కుమార్ మే 9 నుంచి 11 వరకు (ఇంజినీరింగ్)
మే 12 నుంచి 13 వరకు
(అగ్రికల్చర్, ఫార్మసీ)
పీజీఈసెట్ జేఎన్టీయూహెచ్ ఎ అరుణకుమారి జూన్ 6 నుంచి 8 వరకు
ఐసెట్ కేయూ ఎస్ నర్సింహ్మాచారి జూన్ 4 నుంచి 5 వరకు
ఈసెట్ ఓయూ శ్రీరాం వెంకటేశ్ మే 6
లాసెట్ ఓయూ బి విజయలక్ష్మి జూన్ 3
ఎడ్సెట్ ఎంజీయూ టి మృణాళిని మే 23
పీఈసెట్ ఎస్యూ రాజేష్కుమార్ జూన్ 10 నుంచి 13 వరకు