– మండలంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియాంబర్స్ వెంటనే విడుదల చేయాలనే డిమాండ్ తో చేపట్టిన విద్యా సంస్థ బంద్ శుక్రవారం విజయవంతం అయ్యింది. మండలంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ప్రభుత్వ పాఠశాలలను పిడిఎస్ యు ఆధ్వర్యంలో బంద్ చేయించారు. ఈ సందర్భంగా పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియాంబర్స్ వెంటనే విడుదల చేయాలని, కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తక్షణమే అమలు చేయాలని, విద్యార్థులకు ఉచిత బస్ పాస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా కొనసాగుతున్నాయని విమర్శించారు. గత అనేక సంవత్సరాలుగా విద్యార్థులకు అందాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వేల కోట్ల రూపాయల మేర పెండింగ్లో ఉండటంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల భవనాలను పునర్నిర్మించాలని, విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని, సంక్షేమ హాస్టళ్లలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని, విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని విస్తరించాలని కోరారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు.
విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ విజయవంతంగా జరిగిందన్నారు.రానున్న రోజుల్లో విద్యా సమస్యల పరిష్కారం కాకపోతే మరింత ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు డివిజన్ నాయకులు రాహుల్, స్టాలిన్, వైష్ణవి, తదితరులు పాల్గొన్నారు.



