– ముగిసిన 38వ జాతీయ క్రీడలు
– ముఖ్య అతిథులుగా అమిత్ షా, మాండవీయ
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ వేదికగా జరిగిన 38వ జాతీయ క్రీడలు శుక్రవారంతో ముగిసాయి. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథులుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, క్రీడల మంత్రి మన్షుక్ మాండవీయ హాజరయ్యారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధమి వీరిని సాదరంగా ఆహ్వానించారు. మాండవీయ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం జాతీయ క్రీడలను దిగ్విజయంగా పూర్తిచేసిందని, అథ్లెట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడం హర్షణీయమన్నారు. రాబోయే రోజుల్లో ఉత్తరాఖండ్ స్పోర్ట్స్ హబ్గా నిలుస్తుందని కొనియాడారు. 2036 ఒలింపిక్స్కు భారత్ ఆతిథ్యమే లక్ష్యంగా క్రీడలు దిగ్విజయంగా ముగిసాయమని పేర్కొన్నారు. 39వ జాతీయ క్రీడలు మేఘాలయాలో జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కొంగల్ సంగ్మా ఉత్తరాఖండ్ క్రీడల మంత్రి రేఖా ఆర్యా క్రీడల బారెన్ను అందించారు. ఈ కార్యక్రమంలో భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఎ) అధ్యక్షురాలు పిటి ఉష, మహిళల బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్, ఒలింపిక్ పతక విజేతలు గగన్ నారంగ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముగింపు వేడుకలకు దాదాపు 25వేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు.
ఈ క్రీడల్లో అత్యధిక స్వర్ణ పతకాలను సర్వీసెస్ జట్టు సాధించి టాప్లో నిలువగా.. రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్ర 198పతకాలతో నిలిచింది. ఇందులో 54స్వర్ణ, 71రజత, 73కాంస్యాలుండగా.. మూడో స్థానంలో హర్యానా ఉంది. హర్యానా సాధించిన 153పతకాల్లో 48స్వర్ణ, 47రజత, 58కాంస్య పతకాలుండగా.. కర్ణాటక, మధ్యప్రదేశ్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.