హైదరాబాద్‌ చిత్తు చిత్తుగా!

– ఇన్నింగ్స్‌ 57 పరుగుల తేడాతో ఓటమి
నవతెలంగాణ,హైదరాబాద్‌
రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ నాల్గో పరాజయం మూటగట్టుకుంది. మ్యాచ్‌ మ్యాచ్‌కు మరింత దిగజారిన హైదరాబాద్‌ ప్రదర్శన.. ఎలైట్‌ గ్రూప్‌-బిలో సౌరాష్ట్రతో మ్యాచ్‌కు మరింత దిగజారింది. జింఖానా మైదానంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ రెండు రోజుల్లోనే పరాజయం పాలైంది. తొలుత తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌ 79 పరుగులకు కుప్పకూలింది. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 327 పరుగుల భారీ స్కోరు చేసింది. హార్విక్‌ దేశారు (81), చిరాగ్‌ జాని (68), షెల్డన్‌ జాక్సన్‌ (59), ధర్మేంద్రసిన్హ జడేజా (40)లు రాణించటంతో తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్ర భారీ ఆధిక్యం దక్కించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులకే కుప్పకూలింది. లంచ్‌కు ముందు రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన హైదరాబాద్‌ లంచ్‌ విరామ సమయానికి ఐదు వికెట్లు చేజార్చుకుంది. టీ విరామానికి ముందే హైదరాబాద్‌ ఆలౌట్‌ ఇన్నింగ్స్‌ 57 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. టి. సంతోష్‌ గౌడ్‌ (58, 125 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), చందన్‌ సహాని (49, 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), భవేశ్‌ సేత్‌ (30), రవితేజ (20) హైదరాబాద్‌ ఓటమి అంతరాన్ని తగ్గించారు. ఐదు మ్యాచుల్లో నాలుగు ఓటములతో హైదరాబాద్‌ ఎలైట్‌ గ్రూప్‌-బిలో చివరి స్థానానికి పరిమితమైంది.

Spread the love