బీఎల్ఏల సేవలను అభినందించిన డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ సర్ (SIR) ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొని, జుక్కల్ నియోజకవర్గంలో సర్ (SIR ) ప్రక్రియను 100 శాతం విజయవంతంగా పూర్తి చేసిన బిఎల్ఏ (BLA ) లను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఓటరికి న్యాయం జరిగేలా బిఎల్ఏ ( BLA)లు అత్యంత బాధ్యతాయుతంగా, నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఖచ్చితమైన ఓటరు జాబితా కీలకమని పేర్కొంటూ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కాపాడడంలో ప్రతి బిఎల్ఏ(BLA )చేసిన కృషి అభినందనీయమని అన్నారు. అదే సేవా స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా ప్రజలకు అండగా నిలుస్తూ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జులు , బిఎల్ఏ (BLA)లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.



