నవతెలంగాణ – అశ్వారావుపేట
నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను నిరసిస్తూ సీపీఐ(ఎంఎల్) మాస్లైన్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం అశ్వారావుపేట మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పెరిగిన ధరలను తగ్గించాలని కోరుతూ తహశీల్దార్ దాసరి కిశోర్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు గోకినపల్లి ప్రభాకర్, ఏఐయూకేఎస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కంగాల కల్లయ్య మాట్లాడుతూ.. సామాన్యుల ఆదాయాలు పెద్దగా పెరగకపోయినా నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరుగుతోందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు పేదల జీవనంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని వారు విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తున్నారంటూ ఆరోపించారు. మార్కెట్లో ధరల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజు, పీవైఎల్ డివిజన్ కార్యదర్శి బాడిస లక్ష్మణ్రావు, పీఓడబ్ల్యూ మండల కార్యదర్శి కంగాల భూలక్ష్మి, పార్టీ నాయకులు కుంజా అర్జున్, కారం మల్లేష్, ధర్ముల శ్రీరాములు, కొమరం చిన్నలక్ష్మి, కొమరం సింగమ్మ, కబ్బాడి కవిత, కుర్సం పోతురాజు, తెల్లం సత్యం, కంగాల కన్నయ్య, మడివి ముత్యాలు, పూర్రే చెల్లమ్మ, ముయ్యబోయిన లక్ష్మి, సోడెం రామమ్మ తదితరులు పాల్గొన్నారు.



