నవతెలంగాణ – హైదరాబాద్: తిండి తినటం లేదంటే… ఏడాది పిల్లలకూ సెల్ఫోన్ చేతిలో పెట్టేసి… ముద్ద నోట్లో పెడుతున్న కాలం! తప్పని తెలిసినా అనివార్యంగా పిల్లలను ఫోన్లకు, సోషల్ మీడియాకు అలవాటు చేస్తున్నామనే ఆందోళన పెరుగుతోంది. అందుకే… పదహారేళ్ల వయసు దాటేదాకా పిల్లలను సోషల్మీడియాకు దూరంగా ఉంచాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. తాజాగా ఆస్ట్రేలియా ఆ దిశగా అడుగులు వేస్తోంది. 16 ఏండ్లలోపు పిల్లలు సోషల్మీడియా చూడకుండా నిషేధం విధించాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఫేస్బుక్లాంటి అనేక సోషల్మీడియా వేదికల్లో చేరికకు 13 ఏండ్ల వయసుండాలనే నిబంధన ఉన్నా… దాన్ని అతిక్రమించడం పెద్ద కష్టమేమీ కావటం లేదు. అందుకే ఏకంగా నిషేధం విధించేలా చట్టం చేయాలనుకుంటున్నారు. ఆస్ట్రేలియాలోని అనేక రాష్ట్రాలతో పాటు… ఆదేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా ఇందుకు మద్దతు పలికారు. మితిమీరిన సోషల్మీడియా వాడకం పిల్లల్ని దారితప్పేలా చేయటంతోపాటు… వారి మానసిక ఆరోగ్యానికీ నష్టం చేస్తోందన్నారు. ఆన్లైన్లో కాకుండా… మైదానాల్లో ఆడుకునేలా చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే చైనా, జపాన్, ఫ్రాన్స్లాంటి దేశాలు… నిషేధం విధించకున్నా… పిల్లలు మొబైల్, ట్యాబ్లాంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాయి.