నవతెలంగాణ-హైదరాబాద్ : పోటీ పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యావ్యవస్థలో సంస్కరణలను డిమాండ్ చేస్తూ గత 26 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త, విద్యావేత్త సోనమ్ వాంగ్చుక్ ఎట్టకేలకు తన పోరాటాన్ని విరమించారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులపై ఎలాంటి చట్టపరమైన కేసులు నమోదు చేయబోమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన హామీతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ల సమక్షంలో వారి చేతుల మీదుగా నిమ్మరసం తాగి వాంగ్చుక్ తన 26 రోజుల సుదీర్ఘ దీక్షకు స్వస్తి పలికారు. ఈ సమయంలో ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో కూడా పక్కనే ఉన్నారు.
దేశంలో తలెత్తే తీవ్ర పరిణామాలు, హింసాత్మక ఘటనలను అరికట్టేందుకే సుదీర్ఘ చర్చల అనంతరం తాను దీక్ష విరమించానని, ఏయే షరతులకు ప్రభుత్వం ఒప్పుకుందో త్వరలోనే వివరణాత్మక వీడియో ద్వారా తెలియజేస్తానని వాంగ్చుక్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. జులై 20న పార్లమెంట్ మార్చ్లో, జంతర్ మంతర్ వద్ద ప్రశాంతంగా నిరసన తెలిపిన వారిపై ఎలాంటి కేసులు పెట్టబోమని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా నీట్ లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించే అంశాన్ని కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ కార్యదర్శిని పదవి నుంచి తొలగించడమే కాక, కేసుల విచారణకు ఫాస్ట్ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసింది.



