సీబీఐ దర్యాప్తుపై స్టే ఇవ్వండి

– ఎంపీ అవినాష్‌రెడ్డి పిటిషన్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ చేస్తున్న దర్యాప్తును నిలిపేస్తూ స్టే ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో గురువారం లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు దర్యాప్తును అడ్డుకోని పక్షంలో సీబీఐ విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. తనను కేసులో అన్యాయంగా ఇరికించే కుట్ర జరుగుతోందని, వెంటనే హైకోర్టు న్యాయం చేయాలని కోరారు. వైఎస్‌ వివేకా 2010లో షేక్‌ షమీమ్‌ను రెండో పెండ్లి చేసుకున్నారనీ, దీంతో వివేకాకు భార్య, కుమార్తెలతో గొడవలు వచ్చాయని తెలిపారు. వివేకా-షమీమ్‌లకు 2015లో కొడుకు కూడా పుట్డడంతో ఆస్తుల వివాదం కూడా వచ్చిందన్నారు. వివేకా హత్య తర్వాత టీడీపీ కడప జిల్లా నేత బీటెక్‌ రవిని వివేకా కుమార్తె సునీత కలిశారనూ, సునీత భర్త రాజశేఖర్‌రెడ్డితో కలపి టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారనీ, వివేకా హత్య కేసు వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి.

Spread the love