– మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వినతి
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఏజెన్సీ ప్రాంత గిరిజన విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కోరారు. హైదరాబాద్ లో శనివారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగులు, సీనియర్ సిటిజన్ల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఆయన చాంబర్ లో ఏజెన్సీ విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కలిసి శనివారం కలిశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని గిరిజన విద్య, ఉద్యోగ, సంక్షేమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం సమర్పించారు. ములకలపల్లి మండలంలో గిరిజన బాలికల ఉన్నత విద్యకు అనుకూలంగా నూతనంగా ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలను మంజూరు చేయాలని కోరారు.
అలాగే ఏజెన్సీ ప్రాంత గిరిజన యువతకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో ప్రయోజనం కల్పించే 75 శాతం జీవోను పునరుద్ధరించి సమర్థవంతంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలో చేపట్టనున్న పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగ యువతకు తగిన ప్రాధాన్యత కల్పించి న్యాయం చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గిరిజన ప్రాంతాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.



