అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

నవతెలంగాణ-షాబాద్‌
అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన షాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ గురువయ్యగౌడ్‌ తెలిపిన వివరాల మేరకు షాబాద్‌కు చెందిన తొంట వెంకటయ్య దైవాలగూడ గ్రామానికి వెళ్లే దారిలో ఓ ఫంక్షన్‌ హాల్‌ నిర్మిస్తున్నాడు. నిర్మాణ పనులకు కాంట్రాక్టు నిమిత్తం హైదరాబాద్‌ ఫలకునామాకు చెందిన మహమ్మద్‌ షబ్బీరుకు ఇచ్చాడు. ఒక నెల రోజుల నుంచి కాంట్రాక్టర్‌ ఇక్కడ మరో ఐదుగురి కూలీలతో రోజువారి పనులు చేయిస్తున్నాడు. అందులో నుంచి ముగ్గురు కూలీలు ఇంటికి వెళ్లగా, ఇక్కడ రహీంఖాన్‌, రోహిత్‌ కుమార్‌(30) లు ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం వాచ్‌మెన్‌ ఫంక్షన్‌హాల్‌కు వచ్చి చూడగా ఒక లేబర్‌ మృతి చెందాడు.ఈ విషయం గమనించి యజమాని వెంకటయ్యకు ఫోన్‌లో సమాచారం ఇచ్చాడు. దీంతో వెంటనే తొంట వెంకటయ్య అక్కడకు చేరుకుని చూడగా రోహిత్‌ కుమార్‌ తలకు తీవ్ర గాయంతో మృతి చెంది ఉన్నాడు. మతి చెందిన రోహిత్‌ తో పాటు రహీంఖాన్‌ మాత్రమే ఫంక్షన్‌ హాల్లో పనిచేస్తుండటంతో అతనే కొట్టి చంపి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రహీంఖాన్‌ పరారీలో ఉన్నాడు. మృతుడు, అనుమానితుడు ఇద్దరు ఉత్తరప్రదేశ్‌ చెందినవారని పోలీసులు తెలిపారు. ఈ మెరుకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్‌ గురువయ్యగౌడ్‌ తెలిపారు.

Spread the love