నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలో రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు నకిలీ కార్డులకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో కూడిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేసేందుకు సిద్ధమైంది. మొత్తం తొమ్మిది రకాల సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ఈ కార్డుల పంపిణీని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రారంభించనున్నారు. సంగారెడ్డి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించి, సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా పౌరసరఫరాల శాఖ ఈ నూతన కార్డులను అందుబాటులోకి తీసుకువస్తోంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ కార్డులలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అధికారిక సంతకం, తెలంగాణ ప్రభుత్వ అధికారిక హోలోగ్రామ్తో పాటు, స్పర్శతో గుర్తించేలా “గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ” అనే అక్షరాలు ఉంటాయి. సాధారణ ముద్రణతో నకిలీ చేయడానికి వీలులేని మైక్రోటెక్స్ట్, ప్రత్యేక కోణంలో చూసినప్పుడు మాత్రమే కనిపించే ‘GoTG’, ‘Original’ వంటి పదాలను కూడా ఇందులో పొందుపరిచారు.
వీటితో పాటు, కాంతికి ఎదురుగా ఉంచినప్పుడు కనిపించే వాటర్మార్క్ లోగో, అతినీలలోహిత కాంతిలో మెరిసే ఇన్విజిబుల్ లోగో, కార్డు వివరాలను ధ్రువీకరించే ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్, గిలోష్ ప్యాటర్న్ వంటి అత్యాధునిక సాంకేతికతను జోడించారు. కరెన్సీ నోట్లు, పాస్పోర్టుల తయారీలో అనుసరించే అత్యున్నత భద్రతా ప్రమాణాలను ఈ కార్డుల తయారీలోనూ పాటించడం ద్వారా నకిలీ కార్డుల ముద్రణను పూర్తిగా నిరోధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.6 కోట్ల ఆహార భద్రత కార్డులు ఉండగా, వాటి ద్వారా 3.43 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ఈ నూతన స్మార్ట్ కార్డుల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఫలాలు సక్రమంగా అందేలా చూడటమే తమ అంతిమ లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది.



