తిరుమల ఘాట్‌ రోడ్డులో బోల్తాపడిన టెంపో…

నవతెలంగాణ – తిరుమల: తిరుమల నుంచి తిరుపతికి మొదటి ఘట్‌ రోడ్డు మీదుగా కిందికి దిగుతున్న టెంపో వాహనం బోల్తాపడింది. కర్ణాటకలోని కోలార్‌కు చెందిన భక్తులు.. శ్రీవారిని దర్శించుకొని మొదటి ఘాట్‌ రోడ్డులో కిందికి దిగుతుండగా ఆరో మలుపు వద్ద వాహనం రోడ్డు పక్కన ఉన్న రక్షణ గోడను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 13మంది భక్తులు గాయపడ్డారు. ఘాట్‌ రోడ్డు భద్రతా సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గాయపడిన భక్తులను ప్రభుత్వ రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన భక్తులకు మెరుగైన చికిత్స అందించాలని తితిదే ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. జేఈవో వీరబ్రహ్మం క్షతగాత్రులను రుయా నుంచి బర్డ్ హస్పిటల్‌కు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఘాట్ రోడ్డులో వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఈవో ధర్మారెడ్డి విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.

Spread the love