విధులలో చేరిన మూడో రోజే  కొరడా ఝుళిపించిన జిల్లా కలెక్టర్

– ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ 
– డబ్బులు వసూలు చేస్తున్నందుకు ఇద్దరు వార్డు బాయ్స్ సస్పెన్షన్
– విధులకు  గైర్హాజరైతే  చర్యలు తీసుకుంటామని డ్యూటీ డాక్టర్లకు హెచ్చరిక
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లా కలెక్టర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సి.నారాయణరెడ్డి విధుల్లో చేరిన మూడో రోజే కొరడా ఝుళిపించారు.ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, వార్డులో రోగుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నందుకు ఇద్దరు  వార్డు బాయ్స్ ను సస్పెన్షన్ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ, ఐసీయూ, పాలియేటివ్ కేర్, మేల్, ఫిమేల్ వార్డులు, సర్గికల్,పోస్ట్ ఆపరేటివ్ వార్డు, ఎం సి హెచ్ వార్డులన్నింటిని కలియతిరిగారు.ఆయా వార్డులలో రోగుల బంధువులతో ముఖాముఖి మాట్లాడి వారి  పేషంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వైద్య సేవలు ఎలా ఉన్నాయని? రూ.5 రూపాయల భోజనం ఇస్తున్నారా ? లేదా? తాగునీరు ఎలా ఉంది ? టాయిలెట్లు బాగున్నాయా? ఎక్కడ పడుకుంటున్నారని  ? అన్ని వివరాలను కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు. మేల్ సర్జికల్ వార్డులో ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారని రోగుల సహాయకులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా, కలెక్టర్  తీవ్రంగా స్పందిస్తూ కేవలం పేదలు మాత్రమే ప్రభుత్వాసుపత్రికి వస్తారని, ఆపదతో ఆసుపత్రికి వస్తే డబ్బులు అడుగుతారా అని  ఆగ్రహం వ్యక్తం చేస్తూ డబ్బులు అడిగిన ఇద్దరు  వార్డ్ బాయ్ లను సస్పెండ్  చేశారు.
డ్యూటీ డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది ఆయా వార్డులు,షిఫ్ట్ లవారీగా పనిచేసే వారి వివరాలను ఆస్పత్రి సూపరింటిండెంట్ ను అడగడమే కాకుండా హాజరు రిజిస్టర్ లను తనిఖీ చేశారు. డ్యూటీ డాక్టర్లు డ్యూటీ సమయంలో ఆస్పత్రిలోనే అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని, అందుబాటులో లేనట్లయితే వారిపై గట్టి చర్యలు తీసుకోవడమే కాకుండా, ఒకవేళ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నట్లయితే తొలగించడానికి సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. అన్ని వార్డులలో డాక్టర్లతో పాటు, సిబ్బంది, నర్సులు వారికి కేటాయించిన షిఫ్ట్ సమయాలలో తప్పనిసరిగా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పని చేస్తేనే ఆసుపత్రిలో ఉండాలని, లేకుంటే ఉద్యోగం వదిలి వెళ్లిపోయినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని  హెచ్చరించారు. పారిశుధ్య సిబ్బందితో  ప్రత్యేకంగా మాట్లాడారు. ఆసుపత్రిలో మొత్తం ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారని ? ఆయా అవార్డులలో ఎన్నిసార్లు శుభ్రం చేస్తున్నారని అడిగారు. పారిశుధ్య సిబ్బంది కాంట్రాక్టర్ తో మాట్లాడుతూ అన్ని వార్డులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, లేనట్లయితే కాంట్రాక్టును రద్దు చేస్తామని హెచ్చరించారు. పారిశుధ్య సిబ్బంది లేదా  ఇతర సిబ్బంది  రోగుల నుండి డబ్బులు అడుగుతున్నట్లు తమ దృష్టికి వస్తే జీతం నిలిపివేస్తామని, రోగులను, సహాయకులను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాతా శిశు ఆరోగ్య విభాగాన్ని తనిఖీ చేసి ఇప్పటివరకు నిర్వహించిన  ప్రసవాలు,సాధారణ ప్రసవాలు, ఆపరేషన్ ద్వారా జరిగిన ప్రసవాల సంఖ్య ను అడిగి తెలుసుకున్నారు. తనకి సమయంలో ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి సూపరింటెండెంట్ నిత్యానంద్,ఆర్ ఎం ఓ ప్రశాంత్, డ్యూటీ డాక్టర్లు, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.
Spread the love