– 108 హెక్టార్లలో తగలబడిన అటవీభూములు
– రంగంలోకి దిగిన సైన్యం
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ అడవుల్లో దావానలం చెలరేగింది. గత 60గంటలుగా సాగుతున్న ఈ కార్చిచ్చుతో ఇప్పటివరకు రాష్ట్రంలో పలుచోట్ల 108 హెక్టార్ల మేరా అటవీ భూములు తగలబడ్డాయి. నైనితాల్ జిల్లా ప్రధాన కేంద్రానికి సమీపంలోనే మంటలు చెలరేగడంతో ఆ పక్కనే గల హైకోర్టు కాలనీ ప్రాంత ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో ఇరుక్కున్నారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సైన్యాన్ని, అటవీశాఖ సిబ్బందిని రంగంలోకి దింపింది. ఆర్మీకి చెందిన ఎంఐ 17 హెలికాప్టర్లు భీమ్తాల్ సరస్సు నుంచి నీటిని తీసుకువచ్చి అడవీ ప్రాంతాలపై జల్లి మంటల ఉధృతిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. చాలావరకు మంటలను అదుపు చేయగలిగినట్లు అధికారులు తెలిపారు. గత 24గంటల్లో రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు 23 చోటు చేసుకున్నాయన్నారు. ముఖ్యమంత్రి పుష్కర్ దామి అత్యవసర సమావేశం జరిపి పరిస్థితులను సమీక్షించారు.