ఈ నరమేధం జాత్యహంకారానికి నిదర్శనమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు అన్నారు. ఖమ్మం జెడ్పీసెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. పాలస్తీనా, ఇజ్రాయిల్ ఘర్షణలకు కారణాలు ఏవైనా కావచ్చు.. రెండు పక్షాలకూ తమవైన రాజకీయ కారణాలు ఏవైనా ఉండొచ్చు.. చిన్నారులేం నేరం చేశారని ప్రశ్నించారు. మహిళలేం పాపం చేశారని అడిగారు. అడగాల్సింది మానవత్వం గురించి అని, గాజాపై ఇజ్రాయిల్ దాడులు నిలువెత్తు మానవ హక్కుల ఉల్లంఘన, అక్షరాలా అన్యాయం.. హింసకు పరాకాష్ట అన్నారు. ఈ దౌర్జన్యం వల్ల గాజాలో నీరు, విద్యుత్, ఆహారం, ఔషధాల కొరత తీవ్రమైందని తెలిపారు. ఆస్పత్రులు, పాఠశాలలు ధ్వంసమయ్యాయని, పౌరులెందరో చనిపోయారని అన్నారు. పసి పిల్లలు మరణిస్తున్నారని, ఇప్పటి వరకు 18,500 పసి హత్యలు జరిగాయని అనధికారిక లెక్క.. మొత్తం 80 వేలమంది చనిపోయారని వివరించారు. 2005లో గాజాకు స్వేచ్ఛ ఇచ్చినట్టే ఇచ్చి భూమి, సముద్రం, గగనతలంపై ఇజ్రాయిల్ లెక్కలేనన్ని ఆంక్షలు విధించిందని తెలిపారు. పాలస్తీనాలో చిన్నారుల భవితవ్యాన్ని చిధిమేస్తున్న ఇజ్రాయిల్ దురహంకార దాడుల్ని ఖండించాలని పిలుపునిచ్చారు. ఒక ప్రణాళిక ప్రకారం అమెరికా, ఇజ్రాయిల్ కలిసి గాజాను ఆక్రమించే ప్రయత్నంలో భాగంగానే ఈ యుద్ధం జరుగుతోందన్నారు. కేవలం అక్కడ ఉన్న ముడి సరుకుని దృష్టిలో పెట్టుకొని అమెరికా ఆడిస్తున్న నాటకం అన్నారు. ప్రపంచం అంతా ఖండిస్తున్నా.. ఆకలి తీరుస్తామని, ఇతర దేశాలు ఇచ్చిన సామాగ్రి పంచుతామని, వాళ్లని రప్పించి తుపాకులతో కాలుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.
జాత్యహంకారానికి పరాకాష్ట : నున్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES