ఎరువుల డీలర్లపై కంపెనీల ఒత్తిడిని నియంత్రించాలి
నవతెలంగాణ – పరకాల
ఎరువుల కంపెనీలు డీలర్లపై లింక్ ప్రొడక్ట్స్ పేరుతో అదనపు ఉత్పత్తులను బలవంతంగా కొనుగోలు చేయించే విధానాన్ని రద్దు చేయాలని పరకాల మండల ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు గందె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) జె. అవినాష్వర్మకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ యూరియా, డీఏపీ వంటి ప్రధాన ఎరువులతో పాటు జింక్, బయో ఫర్టిలైజర్స్ తదితర ఉత్పత్తులను తప్పనిసరిగా లింక్ చేసి విక్రయించేలా కొన్ని కంపెనీలు డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయని తెలిపారు.
డీలర్లకు అవసరం లేని ఉత్పత్తులను కూడా కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సి రావడంతో పెట్టుబడి నిలిచిపోవడంతో పాటు నిల్వలు పెరిగి ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించడమే డీలర్ల ప్రధాన ఉద్దేశమని, అయితే కంపెనీల లింక్ విధానం వల్ల డీలర్లు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కంపెనీల ఒత్తిడిని నియంత్రించి, డీలర్లపై బలవంతపు కొనుగోళ్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఏడీఏ అవినాష్వర్మను కోరారు.డీలర్ల సమస్యలను వ్యవసాయ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.



