ఆగస్టు 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు: యుఎస్పీసీ
నవతెలంగాణ – పరకాల
పాఠశాలలు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పీసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయులు నిరసన చేపట్టి, తహసీల్దార్ ద్వారా ముఖ్యమంత్రికి మెమోరాండం సమర్పించారు.పీఆర్సీ నివేదికను వెంటనే అమలు చేసి, 2023 జూలై 1 నుంచి వేతన సవరణ వర్తింపజేయాలని, పెండింగ్లో ఉన్న డీఏలను విడుదల చేయాలని కోరారు. సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు.జీవో 317 కారణంగా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులను వారి స్థానిక జిల్లాలకు బదిలీ చేయాలని, విద్యాశాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ఉపాధ్యాయులకు ఆరోగ్య సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించాలని కోరారు.పాఠశాల సమయాల్లో ఉపాధ్యాయులకు బోధనేతర, ఆన్లైన్ పనులు, శిక్షణ కార్యక్రమాలు అప్పగించడం వల్ల విద్యాబోధనకు ఆటంకం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి మినహాయించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.సమస్యలు పరిష్కరించకపోతే ఆగస్టు 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఆగస్టు 29న రాష్ట్ర రాజధానిలో వేలాది మంది ఉపాధ్యాయులతో నిరసన చేపడతామని, అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా ‘ఛలో అసెంబ్లీ’ నిర్వహిస్తామని యుఎస్పీసీ నాయకులు తెలిపారు.కార్యక్రమంలో యుఎస్పీసీ బాధ్యులు రాజారాం, రమేష్, మెరుగు ప్రసన్న, బిక్షపతి, నవీన్, బాబు, భాగ్యలక్ష్మి, రజియా సుల్తానా, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



