– ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టీ.నాగరాజు
నవతెలంగాణ-ఖమ్మం
గత ప్రభుత్వం లాగానే నూతన ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టీ.నాగరాజు ఆరోపించారు. శుక్రవారం ఖమ్మంలోని సుందరయ్య భవనంలో ఎస్ఎఫ్ఐ 46 వ జిల్లా మహాసభలను ఘనంగా నిర్వహించారు. ప్రారంభ సూచికగా జెండా ఆవిష్కరణ చేసి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ మహాసభలో ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం 23 ఏళ్ల వయసులోని సైతం చిరునవ్వుతో ముద్దాడినటువంటి భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని విద్యరంగ సమస్యల పరిష్కారం కోసం ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు డైట్ చార్జీలను ఇవ్వకుండా ఇదే రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థుల తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బీ. వీరభద్రం మాట్లాడుతూ విద్యారంగంలో సమస్యలు పరిష్కారానికి నిరంతరం పోరాడే సంఘం ఎస్ఎఫ్ఐ అని, భవిష్యత్తులో ఇంకా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, ప్రవీణ్, జిల్లా ఉపాధ్యక్షులు రాజు, వెంకటేష్, సరళ, సంగీత సహాయ కార్యదర్శి ప్రేమ్ కుమార్, వెంకటేష్, జిల్లా కమిటీ సభ్యులు వీరేందర్, వెంకటలక్ష్మి, నాగరాజు, ఉమేష్, వరుణ్, యశ్వంత్, వెంకటేశ్వర్రెడ్డి, నాయకులు శ్వేత, తిరుమల్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.