మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలోనే లోపాలున్నాయి: కోదండరామ్‌

నవతెలంగాణ – హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలోనే లోపాలున్నాయని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. మేడిగడ్డను పరిస్థితులకు అనుకూలంగా డిజైన్‌ చేయలేదని.. ప్రాజెక్టును తొందరగా పూర్తి చేయాలని చూశారని తెలిపారు. బీఆర్ఎస్​ను ఓడించకపోతే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. ఆ పార్టీని ఓడించగలిగితే భవిష్యత్తులో పురోగతినే ఉంటుందని అభిప్రాయపడ్డారు. వరంగల్ జిల్లా నర్సంపేట మీదుగా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు వెళ్తున్న క్రమంలో నర్సంపేటలో విలేకరుల సమావేశంలో కోదండరాం మాట్లాడారు.  రాష్ట ప్రభుత్వం మేడిగడ్డి ప్రాజెక్టును డబ్బు, కమిషన్ల కోసం తొందరగా పూర్తి చేయడం వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. అందుకే బీఆర్ఎస్​ను ఓడించి ప్రజాస్వామ్య తెలంగాణను ఏర్పాటు చేసేందుకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని కోదండరాం తెలిపారు. హస్తం పార్టీకి మద్దతుగా రోడ్‌ షోలు, సమావేశాలు, సభలు వీలైన చోట్ల నిర్వహిస్తామని వెల్లడించారు. ‘రాష్ట్రంలో నిరంకుశ పాలన గత తొమ్మిదిన్నర ఏండ్లుగా కొనసాగుతుంది. ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. చట్టం పట్ల గౌరవం లేదు. రాజ్యాంగానికి విలువనివ్వరు.  అని కేసీఆర్​పై కోదండరాం విమర్శలు కురిపించారు.

Spread the love