నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా గడ్డపై కాలుమోపారు. బుధవారం ఆయన బీజింగ్ చేరుకున్నారు. దాదాపు ఒక దశాబ్దం తర్వాత అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే ప్రథమం. బీజింగ్ క్యాపిటల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రంప్కు చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ సైనిక గౌరవ వందనంతో ఘనస్వాగతం పలికారు. రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ట్రంప్, చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్తో ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొంటారు.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం, వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు, టెక్నాలజీ పోటీ నెలకొన్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ చర్చల్లో ప్రధానంగా వాణిజ్యం, ఇరాన్ యుద్ధం, తైవాన్కు అమెరికా ఆయుధాల విక్రయం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), చిప్స్ వంటి సాంకేతిక అంశాలపై దృష్టి సారించనున్నారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని (ట్రేడ్ ట్రూస్) స్థిరీకరించుకోవాలని రెండు దేశాలూ భావిస్తున్నాయి.
అమెరికా వ్యాపారాలు, వ్యవసాయ ఉత్పత్తుల కోసం చైనా మార్కెట్లను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలని ట్రంప్ కోరుతున్నారు. ఇరాన్కు చైనా అందిస్తున్న ఆర్థిక, వ్యూహాత్మక మద్దతును నిలిపివేయాలని ఆయన ఒత్తిడి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో ట్రంప్తో పాటు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కూడిన భారీ బృందం పాల్గొంటోంది.



