నవతెలంగాణ – హైదరాబాద్: ధనవంతులకు, విద్యార్థులకు ఓ యువతి డ్రగ్స్ సరఫరా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. మంగళూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివమొగ్గ జిల్లా సాగర్కు చెందిన 21 ఏళ్ల సుహానా.. ఉడిపి జిల్లా కుందాపురలోని ఓ ప్రముఖ కళాశాలలో బీసీఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది. చెన్నై నుంచి గంజాయిని తీసుకువచ్చి మంగళూరులోని కాలేజీ విద్యార్థులు, యవకులు, ధనవంతులకు అమ్ముతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పనంబూరు, ముల్కి పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు.
ఇందులో భాగంగా మంగళవారం ముల్కి రైల్వే స్టేషన్ రోడ్డులో కొంతమందికి గంజాయి అమ్ముతుండగా సుహానాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి 1.40 కిలోల హైబ్రిడ్ (దాదాపుగా రూ. 35 లక్షల విలువైన) గంజాయితో పాటు ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయికి మార్కెట్లో అధిక విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు.
నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం కింద కవూరు పోలీస్ స్టేషన్లో, బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ విభాగం కూడా ఆమెపై గతంలో కేసులు నమోదు చేశాయి. ప్రస్తుత ఘటనపై ముల్కి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



