– చెరుపల్లి, పి ప్రభాకర్ సహా పలువురి నివాళి
– హైదరాబాద్ లో ముగిసిన అంత్యక్రియలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడిగె బసవపున్నయ్య తల్లి బొడిగె ఊషమ్మ (70) కన్నుమూశారు. అనారోగ్యంతో ఉన్న ఆమెను హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ఈనెల 22న చేర్పించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె భర్త బొడిగె లక్ష్మయ్య ప్రముఖ న్యాయవాది, వామపక్షవాది. వారికి కుమారులు సుందరయ్య, బసవపున్నయ్య, కుమార్తె ఉదయం ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం శోభనాద్రిపురం స్వగ్రామం. ఆమె మరణవార్త విని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఊషమ్మ భౌతికకాయాన్ని బంధువులు, కుటుంబ సభ్యుల సందర్శనార్దం వనస్థలిపురంలోని హుడాకాంప్లెక్స్ సాయినగర్ (ఎల్లమ్మ దేవాలయం) వద్ద ఆమె పెద్దకుమారుడు సుందరయ్య నివాసం వద్ద ఉంచారు. ఆమెను కడసారి చూసేందుకు బంధువులు, ఆ గ్రామ వాసులు, శ్రేయోభిలాషులు, సీపీఐ(ఎం) నాయకులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, నవతెలంగాణ సిబ్బంది పెద్దఎత్తున తరలివచ్చారు. శనివారం సాయంత్రం హైదరాబాద్లోని వనస్థలిపురంలో ఉన్న సాహెబ్నగర్ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలను కుటుంబ సభ్యులు నిర్వహించారు. అంతకుముందు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, నవతెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) పి ప్రభాకర్, సంపాదకులు ఆర్ సుధాభాస్కర్, న్యూస్ ఎడిటర్ రాంపల్లి రమేష్, బుకహేౌజ్ సంపాదకులు కె ఆనందాచారి, ఇతర బోర్డు సభ్యులతోపాటు తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ, తెలంగాణ రజక సంఘం ప్రధాన కార్యదర్శి పి ఆశయ్య, సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్య, సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే) ప్రతినిధులు జి బుచ్చిరెడ్డి, ఎం సోమయ్య, తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి దూదిమెట్ల బాలరాజుగౌడ్, నవతెలంగాణ జనరల్ మేనేజర్లు ఎం వెంకటేశ్, రఘు, ఉపేందర్రెడ్డి, హైదరాబాద్ రీజియన్ మేనేజర్ లింగారెడ్డి, రంగారెడ్డి రీజియన్ మేనేజర్ మహేందర్, మొఫషీల్ ఇన్చార్జీ జి వేణుమాధవరావు, బ్యూరోఇన్చార్జీ బివిఎన్ పద్మరాజు, సీనియర్ ఫొటో జర్నలిస్టు కెఎన్ హరి, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య, హెచ్యూజే అధ్యక్షులు బి అరుణ్కుమార్, కార్యదర్శి బి జగదీశ్వర్ తదితరులు ఊషమ్మ భౌతికకాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బసవపున్నయ్య, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.