Monday, May 11, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహార్ముజ్‌ ప్రతిపాదనపై అనిశ్చితి

హార్ముజ్‌ ప్రతిపాదనపై అనిశ్చితి

- Advertisement -

ఇరాన్‌ స్పందన కోసం అమెరికా నిరీక్షణ
పశ్చిమ ఆసియా శాంతి చర్చలు ముమ్మరం
అమెరికా, ఇరాన్‌ ఘర్షణ చాలా క్లిష్టమైనది
అణ్వాయుధాల కోసం టెహ్రాన్‌ ప్రయత్నిస్తున్నట్టు ఆధారాలు లేవు: పుతిన్‌

టెహ్రాన్‌: పశ్చిమ ఆసియాలో రెండు నెలలకు పైగా కొనసాగుతున్న సంఘర్షణను ముగించేందుకు జరుగుతున్న దౌత్యపరమైన ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. శనివారం హార్ముజ్‌ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలు స్వల్పంగా తగ్గిన సంకేతాలు కనిపించాయి. ఈ సంఘర్షణను అంతం చేసే లక్ష్యంతో అమెరికా ముందుకు తెచ్చిన కొత్త శాంతి ప్రతిపాదనపై ఇరాన్‌ స్పందన కోసం అంతర్జాతీయ సమాజం ఇప్పుడు నిశితంగా గమనిస్తోంది. వాషింగ్టన్‌ ప్రతిపాదనకు ఇరాన్‌ త్వరలోనే స్పందిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ, టెహ్రాన్‌ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధవీకరణ రాలేదు. ఈలోగా, పశ్చిమ ఆసియాలో ప్రాంతీయ భద్రత, దీర్ఘకాలిక స్థిరత్వంపై చర్చించేందుకు రూబియో మయామిలో మహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌రహ్మాన్‌ అల్‌ థానీతో సమావేశమయ్యారు. ఒక ముఖ్యమైన పరిణామంలో, ఖతార్‌ నుంచి పాకిస్థాన్‌కు వెళ్తున్న ఒక ఎల్‌పిజి గ్యాస్‌ ట్యాంకర్‌ శనివారం హార్ముజ్‌ జలసంధి గుండా ప్రయాణించింది. సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి ఇలా జరగడం ఇదే మొదటిసారి.

మధ్యవర్తిత్వ ప్రయత్నాల్లో పాలుపంచుకుంటున్న దేశాలతో విశ్వాసాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగానే ఇరాన్‌ ఈ ప్రయాణానికి అనుమతి ఇచ్చిందని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరియు ఇంధన మార్కెట్లపై దీని ప్రభావం పెరుగుతున్నందున, ఈ సంఘర్షణను ముగించాలని అన్ని పక్షాలపై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతోంది. శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ, ఈ ప్రాంతంలో చెదురుమదురు ఘర్షణలు జరుగుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. ఇరాన్‌ ఓడరేవులోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న రెండు నౌకలను అమెరికా యుద్ధ విమానాలు అడ్డగించి వెనక్కి పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, శుక్రవారం ఇరాన్‌ నుండి ప్రయోగించిన క్షిపణులు , డ్రోన్‌లను తాము అడ్డుకున్నామని, ఈ దాడిలో ముగ్గురు గాయపడ్డారని యూఏఈ పేర్కొంది.

అమెరికా నౌకలపై క్షిపణులు గురిపెట్టాం దాడులు చేస్తే తీవ్ర ప్రతీకారం : ఐఆర్‌జీసీ వార్నింగ్‌
ఇరాన్‌ చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలపై ఎలాంటి దాడి జరిగినా పశ్చిమాసియా అమెరికా స్థావరాలపై, శత్రు నౌకలపై భారీ ప్రతిదాడి ఉంటుందని ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ (ఐఆర్‌ జీసీ) నావికాదళం హెచ్చరించింది. శుక్రవారం రెండు ఇరాన్‌ చమురుట్యాంకర్లపై అమెరికా దాడి చేసిన నేపథ్యంలో ఇరాన్‌ ప్రభుత్వ టీవీ ద్వారా నౌకాదళం ఈ హెచ్చరిక చేసింది. అయితే ఇరాన్‌ ఓడరేవుల వద్ద తాము విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘించేందుకు యత్నించిన రెండు ఇరాన్‌ ట్యాంకర్లను శుక్రవారం నిలిపివేసినట్టు అమెరికా సైన్యం తెలిపింది. దానికి కొన్నిగంటల ముందు మూడు యుద్ధనౌకలపై దాడులను తిప్పికొట్టామని పేర్కొంది. జలసంధిలోని ఇరాన్‌ సైనిక స్థావరాలపై దాడులు చేశామని అమెరికా సైన్యం వెల్లడించింది. యుద్ధం ముగించడానికి అమెరికా చేసిన ప్రతిపాదనలపై ఇరాన్‌ స్పందన కోసం ట్రంప్‌ సర్కార్‌ ఎదురుచూస్తోంది. హార్ము జ్‌ జలసంధిని తెరవాలని టెహ్రాన్‌ అణు కార్యక్రమం నిలిపివేయాలనే అంశాలపై టెహ్రాన్‌కు అమెరికా కొన్ని ప్రతిపాదనలు చేసింది. వీటిపై ఇరాన్‌ ఇంకా అధికారికంగా స్పందించలేదు. మరోవైపు సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని ఇరాన్‌ ఉన్నతాధికారి చెప్పారు. యుద్ధం ప్రారంభంలో జరిగిన దాడుల్లో మొజ్తబా మోకాలు, వెన్నుకు గాయాలు అయ్యాయని అవి చాలావరకు నయమయ్యాయని తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -