నూతన ఆర్మీచీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది

నూతన ఆర్మీచీఫ్‌గా ఉపేంద్ర ద్వివేది– బాధ్యతల స్వీకరణ
న్యూఢిల్లీ : లెఫ్టినెంట్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ (సిఒఎఎస్‌)గా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 1964 జులై 1న జన్మించిన లెఫ్టినెంట్‌ జనరల్‌ ద్వివేది 1984 డిసెంబర్‌ 15న సైన్యం (జమ్ము కాశ్మీర్‌ రైఫిల్స్‌)లో చేరారు. కమాండ్‌ ఆఫ్‌ రెజిమెంట్‌ (18 జెకెరైఫిల్స్‌), బ్రిగేడ్‌ (26 సెక్టార్‌ అస్సాం రైఫిల్స్‌), డిఐజి, అస్సాం రైఫిల్స్‌ (తూర్పు), 9 కార్ప్స్‌ వంటి కీలక పదవుల్లో పనిచేశారు. నార్తర్న్‌ ఆర్మీ కమాండర్‌గా సుదీర్ఘ కాలం సేవలందించారు.
మధ్యప్రదేశ్‌లోని రేవా సైనిక్‌ స్కూల్‌లో ద్వివేది చదువుకున్నారు. నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేష్‌ కె.త్రిపాఠి ఆయన పూర్వ విద్యార్థి.
ఆర్మీ చీఫ్‌గా రెండేళ్లు సేవలందించిన జనరల్‌ మనోజ్‌ పాండే ఆదివారం పదవీ విరమణ చేశారు. 2022 ఏప్రిల్‌ 30న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మనోజ్‌ పాండే ఈ ఏడాది మే 30న పదవి విరమణ చేయాల్సి వుంది. కొత్త చీఫ్‌ నియామకంలో జాప్యం కారణంగా కేంద్రం ఆయన సర్వీసును నెలరోజుల పాటు పొడిగించింది. జూన్‌ 11న వైస్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ద్వివేదిని నూతన చీఫ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నూతన నియామకాలు
వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎన్‌ఎస్‌ రాజా సుబ్రమణి, సెంట్రల్‌ ఆర్మీ కమాండర్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ అనింద్యసేన్‌గుప్తా, సౌత్‌ ఆర్మీ కమాండర్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ ధీరజ్‌ సేత్‌, సౌత్‌వెస్ట్‌ ఆర్మీ కమాండర్‌గా లెఫ్టినెంట్‌ జనరల్‌ మంజీందర్‌సింగ్‌ నియమితులయ్యారు.

Spread the love