పిల్లల కథల రచయిత పోరెడ్డి రంగయ్య గారు తెలియని వారు లేరు అని నా ఉద్దేశం. వారు రెండు మూడేండ్ల నుంచి కథలు రాయటానికి వచ్చినా ఎవరూ చేయలేని పనిని ఆయన పిల్లల విషయంలో సాధించారు. ఎందరో చిన్నారులతో మరెన్నో కథలను రాయించి పుస్తకాలు రూపంలో ప్రచురించి, ప్రచురించబడేట్లు చేసారు. పిల్లలు ప్రభుత్వ వేడుకలలో పాల్గొనేటట్లు చేసిన ప్రతిభాశాలి. ఎక్కడ ఉద్యోగం చేసినా అక్కడ పిల్లల కోసం గ్రంథాలయాలని ఏర్పరిచారు. ‘పిల్లలే నా చేత రాయించారు, వారి వల్లే ఈ కథలు వచ్చాయి’ అని నిజాయితీగా ఒప్పుకున్నారు వీరు.
‘స్ఫూర్తి’ కథల పుస్తకానికి వస్తే ప్రతి కథా సందేశాత్మకం. ఎన్నో.. ఎన్నెన్నో ఉపాయాలను వారి కథల ద్వారా తెలియజేసిన విధానం బాగుంది. ‘ఎన్నికల సందడి’ కథలో మనుషుల స్వభావాలను జంతువుల్లో చక్కగా ప్రతిబింబింప చేశారు. ‘పిట్ట పిల్లల తెలివి’లో కూడా అపాయాన్ని ఉపాయంగా చేసుకొని బయటపడటం పిల్లలలో నిజంగానే స్ఫూర్తిని కలగచేస్తుంది. ‘స్ఫూర్తి’ కథలో చీమ తన కన్నా బరువైన వస్తువులను మోయటం చూపిస్తూ రాజకుమారుడుకి మార్గం చూపటం సరి కొత్తగా ఉంది, విషయం పాతదే అయినా. అలాగే ‘చెట్టు గర్వం’లో ఒకరినొకరు విమర్శించుకోకుండా కలిసి ఉండాలని ప్రబోధం కనిపిస్తుంది. ‘అల్లరి మానిన నరేష్’ కథలో పిల్లలతో అల్లరి చేయటం ఎలా పోగొట్టాలో చెప్పిన విధానం సరి కొత్తగా ఉంది. ఇక ‘ప్లాస్టిక్ వాడని ఇల్లు’ పేరులోనే పరమార్థమంతా ఉన్నట్లు స్పష్టం అయిపోతుంది. ఇంటి నుంచి దేశం దాకా సుప్రభాతంలా బాగుపడటానికి తెలియజేసిన విలువైన పాఠం ఇది. ఇలా ఈ పిల్లల కథల పుస్తకంలో ప్రతి కథలో నేర్చుకోవలసిన అంశాలు ఉన్నాయి. అందుకే పిల్లలను చదివింప చేయటానికి, వారికి తెలియజేయటానికి పెద్దలు కూడా కొని చదవాల్సిన పుస్తకం అని ఘంటాపథంగా చెప్పొచ్చు.
యలమర్తి అనూరాధ, 9247260206
ఆద్యంతం ఉపయోగకరం
- Advertisement -
- Advertisement -



