అరుంధతీ రాయ్… ప్రసిద్ధ రచయిత్రి, ఉద్యమకారిణి అయిన ఈమె బుకర్ ప్రైజ్ పొందిన మొట్టమొదటి భారతీయురాలిగా చరిత్రకెక్కారు. నర్మదా బచావ్ ఉద్యోమంలో కీలకపాత్ర పోషించారు. మతోన్మాదులను తన రచనలతో చీల్చి చండాడుతున్నారు. అలాంటి వ్యక్తిని ఉపా చట్టం కింద అరెస్టు చేయాలంటూ ఆర్డర్లు జారీ చేశారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే 13 ఏండ్ల కిందట ఆమెపై పెట్టిన ఓ కేసును ఆధారం చేసుకొని ఇప్పుడు ఆరెస్టు చేయడం. ఇంతకీ ఆమెపై పెట్టిన ఆ కేసేంటి? ఇన్నేండ్ల తర్వాత ఆమెపై ఉపా చట్టం ఎందుకు ప్రయోగించారో ఈ రోజు మానవిలో తెలుసుకుందాం…
అరుంధతి రాయ్ మేఘాలయలోని షిల్లాంగ్లో జన్మించారు. కేరళకు చెందిన యలయాళీ జాకోబైట్ సిరియస్ క్రైస్తవ మహిళా హక్కుల కార్యకర్త అయిన మేరీ రాయ్ ఈమె తల్లి. కోల్కతాకు చెందిన బెంగాలీ బ్రహ్మ సమాజి, టీ తోటల నిర్వాహకుడు రాజీబ్ ఈమె తడ్రి. తనను అందరూ బ్రహ్మణురాలు అంటే ఆమె తీవ్రంగా ఖండించేవారు. ఆమెకు రెండేండ్ల వయసు ఉన్నపుడు ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. తర్వాత ఆమె తన సోదరుడితో కలిసి కేరళ వచ్చేశారు. కొంత కాలం వారి కుటుంబం మేరీ తల్లిదండ్రుల గడిపారు. కేరళ వచ్చిన తర్వాత మేరీ సొంతంగా పాఠశాల ప్రారంభించారు.
టెలివిజన్ జీవితం…
కొట్టాయంలోని కార్పస్ క్రిస్టీలో తన పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తర్వాత తమిళనాడులోని నీలగిరిలోని లారెన్స్ స్కూల్, లవ్డేల్లో చదివారు. ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో ఆరికటెక్చర్ అభ్యసించారు. అక్కడ ఆర్కిటెక్ట్ గెరార్డ్ను డా కున్హాను కలిశారు. వారు 1978లో వివాహం చేసుకున్నారు. అయితే 1982లో వీరు విడిపోయారు. ఢిల్లీ వచ్చిన అరుంధతికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్లో స్థానం లభించింది. అక్కడే 1984లో ఆమెకు సినీ నిర్మాత ప్రదీప్ కిషన్తో పరిచయం ఏర్పడింది. అతనికి అవార్డు తెచ్చిపెట్టిన మస్సే సాహిబ్లో మేకల కాపరి పాత్ర కోసం ఆమెను అడిగారు. అదే ఏడాది వారిద్దరూ పెండ్లి చేసుకున్నారు. ఇద్దరూ కలిసి స్వాతంత్య్ర ఉద్యమం గురించి టెలివిజన్లో ధారావాహిక తీసుకొచ్చారు. అలాగే ఎలక్ట్రిక్ మూన్ అనే రెండు చిత్రాలకు పని చేశారు.
అనుభవాల ఆధారంగా…
1988లో ఇన్ విచ్ అన్నీ గివ్స్ ఇట్ దోస్ వోన్స్ చిత్రానికి ఆమె ఉత్తమ స్క్రీన్ ప్లే జాతీయ చలన చిత్ర అవార్డును అందుకున్నారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిగా తన అనుభవాల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. 1994లో పూలన్దేవి జీవితం ఆధారంగా తీసిన శేఖర్ కపూర్ చిత్రం బాండిట్ క్వీన్ను విమర్శించడంతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే ది గ్రేట్ ఇండియన్ రేప్ ట్రిక్ అనే తన చలన చిత్ర సమీక్షలో ఆమె మహిళపై తన అనుమతి లేకుండా అనుభవించడం అనే హక్కును ప్రశ్నించారు. ఈ రెండు చిత్రాలు మహిళల జీవితాలను కించపరిచే విధంగా ఉన్నాయని వీటిని తప్పుగా చిత్రీకరించారని కపూర్ను ఆమె విమర్శించారు. ఇలాంటి చిత్ర పరిశ్రమపై విసుగుచెంది ఏరోబిక్స్ తరగతులు ప్రారంభించారు.
రచయిత్రిగా…
1992లో ఆమె తన మొదటి నవల రాయడం ప్రారంభించారు. దీన్ని 1996లో పూర్తి చేశారు. ఈ పుస్తకం సెమీ ఆత్మకథ. తన చిన్ననాటి అనుభవాల ఆధారంగా రాసింది. ఆమె ప్రచురించిన ‘ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్’ అనే నవల ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇది 1997లో ఫిక్షన్ విభాగంలో బుకర్ ఫ్రైజ్ అందుకుంది. ది న్యూయార్క్ టైమ్స్ నోటబుల్ బుక్స్ ఆఫ్ ది ఇయర్లో ఒకటిగా గుర్తించబడింది. బెస్ట్ సెల్లర్స్ జాబితాలో నాల్గవ స్థానానికి చేరుకుంది. 18 దేశాల్లో ఈ పుస్తకం అమ్ముడు పోయింది. ఈ పుస్తకం విజయవంతం అయిన తర్వాత ఆమె టెలివిజన్కు ‘ది బన్యన్ ట్రీ’ అనే ధారావాహికతోపాటు ‘ఎ ఫిల్మ్ విత్ అరుంధతీ రాయ్’ అనే డాక్యుమెంటరీ రాశారు. 2007లో తన రెండవ నవల ‘ది మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్’ మొదలుపెట్టారు. 2016లో దీన్ని పెంగ్విన్ ఇండియా, హమీష్ హామిల్టన్ యూకే వారు ఈ పుస్తకాన్ని ప్రచురిస్తామన్నారు. ఈ నవల 2017లో మ్యాన్ బుకర్ ప్రైజ్కు ఎంపిక చేయబడింది. 2018లో ఫిక్షన్ కోసం నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుకు ఫైనలిస్ట్గా ఎంపికయింది.
ఆజాదీ
ఆమె రచించిన ఆజాదీ పుస్తకం ఫ్రెంచ్ అనువాదానికి 45వ యూరోపియన్ ఎస్సే ప్రైజ్లో జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. యావత్ ప్రపంచం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక సవాళ్లను అరుంధతి తన కలం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రపంచాన్ని భయకంపితుల్ని చేస్తున్న ఉగ్రవాదం, ఫాసిజం గురించి అది చేసే దాష్టికాలను, మారణ హోమాన్ని ఈ పుస్తకంలో కండ్లకు కట్టినట్లు రాశారు. ఎందరో జీవితాలను ప్రభావితం చేసేలా ఇందులోని వ్యాసాలు ఉన్నాయి. అజాది అనే పేరు కూడా సరిగ్గా సరి పోయిందంటూ బహుమతి అందించిన ఫౌండేషన్ కితాబు ఇచ్చింది. ఎలాంటి కల్పితాలు లేకుండా వాస్తవాల ప్రాతిపదికన ప్రతింబించేలా ఉన్నాయని కూడా ప్రశంసించింది. అలాగే సమకాలీన రాజకీయాలు, సంస్కృతికి సంబంధించిన అనేక వ్యాసాలు కూడా ఆమె రాశారు. 2014లో పెంగ్విన్ ఇండియా ఐదు వాల్యూమ్స్గా తీసుకొచ్చారు. 2019లో హేమార్కెట్ బుక్స్ ప్రచురించిన మై సెడిషియస్ హార్ట్ అనే ఒకే సంపుటిలో నాన్ ఫిక్షన్ పుస్తకం తీసుకొచ్చారు.
అందుకే ఉపా చట్టం
నర్మదా డ్యామ్ ప్రాజెక్ట్కు వ్యతిరేకంగా మేధా పాట్కర్తో కలిసి ప్రచారం చేశారు. తనకు ఫ్రైజ్గా వచ్చిన డబ్బును ఈ ఆందోళనకు విరాళంగా ఇచ్చారు. సామ్రాజ్యవాదం, పారిశ్రామికీకరణ, ఆర్థిక వృద్ధి పట్ల భారతదేశ విధాలను వ్యతిరేకిస్తూ ఆమె అనేక రచనలు చేశారు. అలాగే కాశ్మీరీ సమస్యపై కూడా 13 ఏండ్ల కిందట స్పందించారు. దాంతో ఆమెపై కేసు పెట్టి జైలుకు పంపారు. ఇప్పుడు ఉపా చట్టం ప్రయోగించారు. కార్పొరేట్లకు, వ్యాపారవేత్తలకు తప్ప సామాన్యులకు న్యాయం చేయని మోడీ ఎన్నికను ఆమె మొదటి నుండి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మతోన్మాద విధాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా తనకు ఇచ్చిన పురస్కారాన్ని సైతం వెనక్కు ఇచ్చేసిన ధైర్యశాలి ఆమె. అందుకే ఆమెపై కేంద్రం కక్ష సాధింపుకు పాల్పడుతున్నది. విచిత్రం ఏమిటంటే ఆమెపై వచ్చిన ఫిర్యాదు దాదాపు 13 ఏండ్ల కిందటిది. ఇప్పటికే బ్యాంకులకు కన్నాలు వేసి, కోట్లు కొల్లగొట్టిన బడా బాబులు, ఆర్థిక నేరస్థులకు అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభు త్వం కేవలం ప్రజల పక్షాన తన గొంతును వినిపిస్తూ, కలం ఝులిపిస్తున్న అరుంధతీ రాయ్ ను మాత్రం అడ్డు కోవడం ఎంత వరకు సబబు అనేది బుద్ధి జీవులందరూ ఆలోచించాల్సిన విషయం.