– చోద్యం చూస్తున్న కేంద్రం
– నీటిని విడుదల చేయని హర్యానా
– బీజేపీ అత్యుత్సాహం
– జల్బోర్డు కార్యాలయంపై దాడి
– కేంద్రం జోక్యం చేసుకోవాలి : ఆప్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్ర రూపు దాల్చింది. ఎగువన ఉన్న హర్యానా.. ఢిల్లీకి నీటిని విడుదల చేయకపోవడంతో ఢిల్లీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే బీజేపీ అత్యుత్సాహంతో యుద్ధాన్ని తలపించే పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ప్రధాన నీటి పైప్లైన్లకు పోలీసులు రక్షణ కల్పించాలని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి కోరారు. నీటి ఎద్దడిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయం వద్ద బీజేపీ చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పలువురు బీజేపీ కార్యకర్తలు జల్బోర్డు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. చత్తార్పూర్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు జల్ బోర్డు కార్యాలయం వద్ద నిరసనలకు దిగారు. అయితే ఈ ఘటనపై బీజేపీ నేత రమేష్ బిధూరి స్పందించారు. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే ఏమైనా చేయగలరని మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
కేంద్రం జోక్యం చేసుకోవాలి
ఢిల్లీలో నీటి సంక్షోభ పరిస్థితి మెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఢిల్లీ మంత్రి అతిషి కోరారు. హర్యానాలోని తమ ప్రభుత్వంతో బీజేపీ చర్చించి ఢిల్లీ ఎక్కువ నీరు పొందేలా చూడాలని అన్నారు. ఢిల్లీలోని ప్రధాన పైప్లైన్లకు భద్రత కల్పించేందుకు పోలీస్ సిబ్బందిని నియమించాలని కోరుతూ ఆదివారం ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజరు అరోరాకు మంత్రి లేఖ రాశారు. సోనియా విహార్ నుండి దక్షిణ ఢిల్లీ ప్రధాన పైప్లైన్లో లీకేజీ ఏర్పడిందని తెలిపారు. దక్షిణ ఢిల్లీ మొత్తానికి నీరందించే ఈ పైప్లైన్ లీకేజీ వెనుక ఏదో కుట్ర ఉన్నట్లు ఆ లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. అయితే ఇది ఆరోపణలు, ప్రత్యారోపణలు, నీచరాజకీయాలకు సమయం కాదని అన్నారు. ఈ పరిస్థితిలో కేంద్రం జోక్యం చేసుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుందని అన్నారు. తమ నీటి నిర్వహణ బృందం ఆరు గంటల పాటు శ్రమించి పైప్లైన్ లీకేజీని సరిచేసిందని ఈ సమయంలో ఆరు గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు. దీంతో దక్షిణ ఢిల్లీలో 25 శాతం నీటి కొరత ఏర్పడిందన్నారు. ఈ సమయంలో 20 ఎంజీడీ నీటిని సరఫరా చేయకపోవడంతో మరో 25 శాతం నీటి కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అతిషి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఢిల్లీలో తీవ్రమైన వేడిగాల్పులు వీస్తున్నాయని, నీటి కొరత ఏర్పడిందని అన్నారు.
ఈ క్రమంలో నీటి పైప్లైన్లను పగులగొట్టి కొరతను మరింత తీవ్రతరం చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని తెలుస్తోందన్నారు. దక్షిణ ఢిల్లీలోని సరఫరా పైప్లైన్లో శనివారం భారీ లీకేజీ ఏర్పడిందని, ఈ విషయం తెలుసుకున్న తమ బృందం మరమ్మతుల కోసం ఓ టీమ్ని పంపగా, చాలా పెద్ద బోల్టులు కోసి ఉన్నట్లుగా గుర్తించారని అన్నారు. మంత్రి సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ కొద్దిరోజులుగా ఢిల్లీలో లీకేజీలు ఉన్నాయంటూ కొందరు నిర్దిష్ట వ్యక్తులు పలు వీడియోలను వైరల్ చేశారన్నారు. లీకేజీ సహజమని తాను అనుకోనని, కొందరు కావాలని లీకేజీలకు కారణమవుతున్నారని తెలిపారు. శనివారం దక్షిణ ఢిల్లీలో పైపులు కట్టే నట్లు, బోల్ట్లు కోసి కనిపించాయన్నారు. వాటిని ఎవరో కట్ చేశారని, దాంతో దక్షిణ ఢిల్లీలో నీటి కరువు ఏర్పడిందన్నారు.