– ఆగస్టు 15లోగా చేసి తీరాల్సిందే
– రుణమాఫీకి విధివిధానాలు రూపొందించండి
– పూర్తి డేటా సేకరించి, ప్రణాళిక సిద్ధం చేయండి : అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీర్చాల్సిందేననీ, దానికి సంబంధించి విధివిధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులకు సూచించారు. పంట రుణమాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో సోమవారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రూ.2లక్షల వరకు రుణాలున్న రైతుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలని ఆదేశించారు. కటాఫ్ డేట్ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా, పీఏసీఎస్ నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు పూర్తి స్థాయి వివరాలతో పాటు అవసరమైన అంచనా వ్యయాన్ని రూపొందించాలని అధికారులకు సూచించారు. రుణమాఫీకి సంబంధించి విధివిధానాలను రూపొందించి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వ్యవసాయ శాఖ, ఇతర అధికారులు పాల్గొన్నారు.