– సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో
న్యూఢిల్లీ : బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల శిక్షా కాలాన్ని తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న చట్టవిరుద్ధమైన నిర్ణయాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో స్వాగతించింది. 2002 గుజరాత్ మారణహౌమం సమయంలో గర్భవతి అయిన బిల్కిస్ బానోపైన, ఆమె కుటుంబ సభ్యులపైన సామూహిక లైంగికదాడికి పాల్పడడం, 14మందిని మూకుమ్మడిగా చంపేసిన కేసులో యావజ్జీవ శిక్ష పడిన 11మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదిస్తూ, శిక్షాకాలాన్ని తగ్గించి ముందస్తుగానే విడుదలజేసింది. వారిని రెండు వారాల్లోగా జైలుకు వెళ్లి లొంగిపోవాలని సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో ఆదేశించింది.
శిక్ష తగ్గింపు ఆదేశాలను జారీ చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేయడమే కాకుండా, దోషులతో ప్రభుత్వం కుమ్మక్కైన విషయాన్ని ఎత్తి చూపింది. శిక్ష తగ్గింపు ఆదేశాలను సమర్ధించుకోవడానికి వాస్తవాలను అందజేయడంలో గుజరాత్ ప్రభుత్వం మోసానికి పాల్పడిందని ధర్మాసనం పేర్కొంది. నేరస్థులు మోసంచేసి శిక్షను తప్పించుకున్నట్టయితే, సమాజంలో శాంతి, భద్రతలు మిధ్యగా మారిపోతాయని సుప్రీం కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం ప్రాతిపదికనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గుజరాత్ ప్రభుత్వం చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లైతే.. ఈ పాపంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా సమ వాటా వున్నట్లేనని సుప్రీంకోర్టు పేర్కొంది. నేరాల క్రూరత్వాన్ని, సమాజంపై వాటి విస్తృత పర్యవసానాలను, చట్టబద్ధ పాలనను వేటినీ పరిగణనలోకి తీసుకోకుండా శిక్షను మార్చారని పొలిట్బ్యూరో పేర్కొంది. ప్రభుత్వాలనేవి రాజ్యాంగబద్ధమైన సంస్థలు. ప్రభుత్వాలు తమ అధికార పరిధులను, చట్టాన్ని, న్యాయ వ్యవస్థను ఉల్లంఘించేలా వ్యవహరించినట్లైతే, అది మన ప్రజాస్వామ్య ఉనికినే ప్రమాదంలో పడేస్తుందని పొలిట్బ్యూరో పేర్కొంది.
ఈ తీర్పు న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం కలిగించింది : బృందా కరత్
బిల్కిస్ బానో కేసులో గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాయి. ఈ తీర్పు న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని నిలిపాయని సీపీఐ(ఎం) నేత బృందాకరత్ పేర్కొన్నారు.
ఐద్వా హర్షం
తీర్పు పట్ల ఐద్వా హర్షం వ్యక్తం చేసింది. జైలు శిక్ష పూర్తి కాకుండానే 14 ఏళ్లకే దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని ఐద్వా ఆనాడే వ్యతిరేకించిందని పేర్కొంది. దోషి రాధేశ్యామ్ భౌతిక ఆధారాలను తొక్కిపట్టి సుప్రీం కోర్టును మోసగించారని, తద్వారా 2022 మేలో సానుకూలమైన ఆదేశాలు పొందారని, అవి, 11మంది దోషులను విడుదల చేయడానికి దారి తీశాయని కోర్టు పేర్కొంది. గుజరాత్ ప్రభుత్వం 2022 మేలో ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయలేదని, అందుకు బదులుగా దోషులతో కుమ్మక్కైందని ఐద్వా పేర్కొంది.
న్యాయానికి దక్కిన విజయం : రాహుల్ గాంధీ
బీజేపీ ప్రభుత్వ దురహంకారానికి వ్యతిరేకంగా బిల్కిస్ బానో అవిశ్రాంతంగా జరిపిన పోరాటానికి దక్కిన విజయమిది. ఎన్నికల ప్రయోజనాల కోసం న్యాయాన్ని చంపేసే ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం. ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో నేరస్తులను పెంచి పోషిస్తోంది ఎవరనే విషయం దేశానికి చాటి చెప్పినట్టయిందని రాహుల్గాంధీ తెలిపారు.