– సీఎంను కలిసిన గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గూగుల్ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం గురువారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. రాష్ట్రంలో పెట్టుబడులు, రహదారి భద్రతపై వారు చర్చించారు. ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందనీ, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం వంటి అంశాల్లో తెలంగాణ కోసం డిజిటలైజేషన్ ఎజెండా అభివృద్ధిలో సేవలు అందించడానికి సిద్దంగా ఉన్నామని వివరించారు. తమ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా నెట్ వర్క్ ఉందనీ, రాష్ట్రాభివృద్ధిలో కలిసి పని చేస్తామని సీఎంకు తెలిపారు. గూగుల్ మ్యాప్స్, ఎర్త్ ప్లాట్ఫాంలను ఉపయోగించి సాధ్యమయ్యే రహదారి భద్రతపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు, రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎంతో హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం భేటి
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బందం డాక్టర్ డొమినిక్ మావో నేతత్వంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని గురువారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల ప్రారంభించిన ‘ప్రోగ్రాం ఫర్ సైంటిఫిక్లీ ఇన్స్పైర్డ్ లీడర్షిప’్ కార్యక్రమం గురించి సీఎంకు వారు వివరించారు. పేద విద్యార్థుల కోసం రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలను బలోపేతం చేయడానికి వీలుగా ఏడాదిపాటు విద్యా కార్యక్రమాలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, కమిషనర్ దేవసేన, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఫ్రొఫె˜సర్ డి.రవీందర్, ఎంఎస్ షెఫాలీ ప్రకాష్, డాక్టర్ ఎండీ రైట్ తదితరులు పాల్గొన్నారు.
పెట్టుబడులకు తెలంగాణల అనుకూలం
సీఎంతో భేటీలో మైక్రాన్ కంపెనీ సీఈవో సంజరు మెహెత్రా
ప్రపంచంలోనే అతి పెద్ద చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంజరు మెహెత్రా గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మైక్రాన్ కంపెనీ ఆసక్తి చూపితే రాష్ట్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలను అందిస్తుందని సీఎం వారికి భరోసా ఇచ్చారు. పరిశ్రమల స్థాపన, నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పకు పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని అన్నారు.