ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాతగా విరించి వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జితేందర్రెడ్డి’. రాకేష్ వర్రె లీడ్ రోల్లో నటించారు. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలతో పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. వైశాలి రాజ్, రియా సుమన్, చత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘అ ఆ ఇ ఈ ఉ ఊ..’ అంటూ సాగే యూత్ఫుల్ లిరికల్ సాంగ్ని విడుదల చేశారు. ఈ పాటకి గోపి సుందర్ మ్యూజిక్ అందించగా, రాంబాబు గోసాల లిరిక్స్ రాశారు. రాహుల్ సిప్లిగంజ్ పాటని చాలా బాగా పాడారు. కాలేజీలో జరిగే ఎలక్షన్స్, గ్యాంగ్స్ మధ్య ఉండే రైవలరీస్ను ఈ లిరికల్ సాంగ్లో చూపించారు. 1980లో జితేందర్ రెడ్డి అనే వ్యక్తి గురించి అందరూ తెలుసుకోవాలి అని ఈ సినిమాని తెరకెక్కించారు. కాలేజ్ స్టూడెంట్ లీడర్గా, అదేవిధంగా ఆ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనే నాయకుడిగా జితేందర్ రెడ్డి చేసిన సేవలను ఈ సినిమాలో చూపిస్తున్నారు.
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ముదిగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ‘ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే సినిమా పై అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సాంగ్ యూత్కి బాగా కనెక్ట్ అవుతుంది. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’ అని అన్నారు.