బీజేపీ అంబేద్కర్‌ను ఎందుకు పొగుడుతుంది?

బీజేపీ అంబేద్కర్‌ను ఎందుకు పొగుడుతుంది?దేశంలో ఎక్కడ చూసినా అంబేద్కర్‌ పేరు నేడు వినిపిస్తున్నది. అయితే వినిపించే వారెవరనుకున్నారు? భారతీయ జనతాపార్టీ అంబేద్కర్‌ను భుజాన వేసుకొని మోస్తున్నది. ఆ నేతలు అంబేద్కర్‌ను తెగ పొగిడేస్తున్నారు.అన్ని పార్టీలు,అందరు రాజకీయవాదులు అంబేద్కర్‌ను గౌరవిస్తుండగా ఇక కావాల్సిందేమున్నది? సామాజిక న్యాయం రాకేం చేస్తుంది? అనేవి నేటి ప్రశ్నలు.అయితే ఒకసారి జాగ్రత్తగా చరిత్రను పరిశీలిస్తే హిందూ మతం హింసతో జంతుబలులు చేస్తూ, యజ్ఞయాగాదులు జరుపుతూ వున్నా రోజులలోనే బౌద్ధం పుట్టింది.అహింసావాదాన్ని ప్రచారం చేసింది.సంఘంలో ఉన్న హెచ్చుతగ్గులు పోవాలని,స్త్రీ పురుషులు సమానం అనీ, మానవులంతా ఒకటేనని అన్నది.అందుకే ప్రజలు బౌద్ధాన్ని ఆరాధించారు.ఆదరించారు. అనుసరించారు.ఇక అప్పుడేం జరిగింది? హిందూ మతం పునరుద్ధరణ పేరిట,రాజుల సహాయంతో శంకరాచార్యులు మొదలైనవారు బౌద్ధాన్ని చంపేశారు.బౌద్ధ భిక్షువులను నాశనం చేసారు. బౌద్ధ ఆరామాలను కొన్నిచోట్ల దేవాలయాలుగా మార్చారు.అయినా బౌద్ధం పూర్తిగా నాశనం కాకపోయేసరికి,బుద్దుడిని పొగడడం ప్రారంభించారు.నేడు అంబేద్కర్‌ను పొగిడినట్లే నాడు బుద్ధుడిని ఆకాశానికికెత్తారు.తెలివిగా బుద్ధుడు కూడా దశావతారాల్లో ఒక్కడన్నారు. దేవుడు అనే భావనను దూరంపెట్టిన బుద్దుడినే దేవుడిగా మార్చి కొలిచారే గానీ బుద్ధుడి భావాలు అమలు పరచలేదు.సమానత్వం అనే మూలభావాన్ని ఆచరించలేదు. అంతిమంగా బౌద్ధాన్ని పారదోలగలిగారు. మన దేశంలో బౌద్ధం నాశనంగావడం పునర్వికాసానికి,హేతువాదానికి, మానవ వాదానికి ప్రమాదంగా పరిణమించింది. కులాల హెచ్చుతగ్గులు మళ్లీ విజంభించాయి.
బౌద్ధులకు, హిందువులకు జరిగిన పోరాటంలో అంటరానితనం పుట్టింది. సంస్కరణవాదులు ఎందరు పైపైన ప్రయత్నించినా,హిందూ సమాజంలోని దోషాల్ని తొలగించలేకపోయారు. ఈ దోషాలకు మూలాధారంగా పవిత్ర మత గ్రంథాలు, శాస్త్రాలు నిలిచాయి.వాటి జోలికి పోకుండా తలపెట్టిన సంస్కరణలు హిందూ మతాన్ని, వాటిలో దోషాల్ని తొలగించలేకపోయాయి. 20వ శతాబ్దంలో అంటరాని తనాన్ని పాటించే హిందూ సమాజం ప్రపంచం దష్టిలో తలవంపులకు గురైంది. అలాంటి స్థితిలో అంబేద్కర్‌ వచ్చి కూలంకషంగా హిందూ సమాజంలోని దోషాల్ని పరిశీలించారు. వాటిపై పోరాడారు.అంటరాని కులాలు,శూద్రులు సమాజంలో గణనీయంగా వున్నారు.వారి ఓట్లు లేనిదే ఏ పార్టీ గెలవదు గనుక కొత్త ఎత్తుగడలతో,తాత్కాలికంగా ఓటర్లను మభ్యపెట్టే వ్యూహాలు అనుసరిస్తున్నాయి. అందులో భాగంగా నేడు అంబేద్కర్‌ ను తెగ పొగిడేస్తున్నారు.అది విని అటు షెడ్యూల్‌ కులాలు,ఇటు శూద్రకులాలు సంతోషపడి ఓట్లు వేయాలనేది బిజెపి ఉద్దేశం.అంబేద్కర్‌ సిద్ధాంతీకరించిన వాటిని ఆమోదించి ఆచరిస్తామంటే అభ్యంతరం ఏమిటి అనే ప్రశ్న రావచ్చు.కానీ పొగుడుతూ, గోతులు తవ్వి అంబేద్కర్‌ ను పూర్తిగా చంపేయాలనే ఎత్తుగడ అయితే, జాగ్రత్త పడాలి. ఆ విషయం శ్రద్ధగా,లోతుగా పరిశీలించాలి. అంబేద్కర్‌ పేరిట, కొందరు బయలుదేరి ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ కమిటీలు వేయమనీ, విగ్రహాలు? ప్రతిష్టించమనీ, ఉత్సవాలు జరపమనీ కోరుతున్నారు. ఇలాంటి అంబేద్కర్‌ వాదులను సంతప్తి పరచడానికి ప్రభుత్వాలు ఎప్పుడూ సిద్ధమే.అది కూడా అంబేద్కర్‌ వాదాన్ని ఉరితీయడానికి పన్నుగడే.ఈ విషయం గ్రహించడానికి అంబేద్కర్‌ వాదులకు కొంతకాలం పట్టొచ్చు ఈలోగా ప్రమాదం జరిగిపోతుంది. అంబేద్కర్‌కు ప్రస్తుతం దేశంలో కొత్త అభిమానులు ఏర్పడ్డారు.
బీజేపీ తమ ఎత్తుగడలో అంబేద్కర్‌ని కూడా చేర్చడం గమనార్హం.కానీ ఈ ఎత్తుగడ విఫలంగాక తప్పదు. అంబేద్కర్‌లో బీజేపీ ఆమోదించే అంశమేదీ కనిపించడం లేదు.కేవలం ఓట్ల కోసమే అంబేద్కర్‌ను శ్లాఘిస్తున్నా,అది మరీ కత్రిమంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే వుంది.ఇటీవలే బిజెపి వారు అయోధ్యలో రామమందిరానైని నిర్మించారు.రామరాజ్యం నిర్మిద్దాం అంటూ, అయోధ్య మందిర నిర్మాణానికై దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు రాళ్ళు మోసుకొని వెళ్ళారు కూడా.కానీ అంబేద్కర్‌ను పొగుడుతూ,ఆయన ఆశయాలను పాటిస్తామంటున్న బీజేపీి వారికి అసలు విషయం తెలియదనుకోలేం గదా! అందులో బాగా చదువుకున్న నాయకులు, అనుచరులు ఉన్నారు.వారిలో అందరూ కాకున్నా, కొందరైనా అంబేద్కర్‌ రచనలు చదివి వుంటారు. హిందూమతాన్ని గురించి, రాముడిని – రామాయణాన్ని గురించి అంబేద్కర్‌ రాసింది వారి దష్టికి వచ్చే వుంటుంది.అంబేద్కర్‌ రచనలలో అముద్రితంగా రచనలు కొన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రచురించగా,అందులో రాముడి గురించిన విషయమై పెద్ద ఆందోళనే జరిగింది. బీజేపీి,శివసేన,హిందూ ఛాందసులు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. కనుక అంబేద్కర్‌లో బీజేపీవారు అంగీకరిస్తున్నదేమిటో, నిరాకరిస్తున్నదేమిటో జనానికి తెలియాలి.ఫలానా విషయం తణీకరిస్తున్నామంటే,ఎందుకో కారణాలు కూడా బిజెపి చెప్పాలి.ఇదేమీ చేయకుండానే బీజేపీ హఠాత్తుగా అంబేద్కర్‌ వర్ధంతులు,జయంతులు జరుపుతూ ఊరేగింపులు చేస్తుంటే ప్రయోజనం ఉండదు.అంబేద్కర్‌ కేవలం ద్వేషంతో,పగతో హిందువులలో అగ్రవర్గాల వారిని, ముఖ్యంగా బ్రాహ్మణ ఛాందసులను తిట్టలేదు. సుదీర్ఘంగా పరిశోధించి, ప్రమాణాలతో విషయ పరిశీలన చేసి చూపారు.పరస్పర విరుద్ధ విషయాలను ఎత్తి ప్రస్తావించారు.మనువు తన ధర్మశాస్త్రంలో పేర్కొన్న అమానుష, క్రూర, ఘోర నియమాలు, నిషిద్ధాలు, అక్రమశిక్షలు, నిచ్చెనమెట్ల సమాజాన్ని బిగించిన తీరు చూపారు. అంటరానితనాన్ని శాస్త్రోక్తంగా సమర్ధిస్తున్న ధర్మాలను అంబేద్కర్‌ చూపారు.ఇవేవీ తెలియనట్లు బీజేపీ నటిస్తోందా? లేక అవన్నీ మరచిపోదాం అంటోందా?
అంబేద్కర్‌ ఆశయాలు అమలు జరగాలంటే,కొన్ని శాస్త్రాల్ని, గీతను,వేదాలను, రామాయణ, మహాభారతంలోని అంశాలను, ధర్మశాస్త్రాల్ని పక్కన బెట్టాలి. పాఠ్య గ్రంథాలలో యీ అంశాలు రాకుండా చూడాలి.అంటరానితనాన్ని పాటించే ఆశ్రమాధి పతుల్ని ఖండించాలి.ఇవి చేయడానికి బీజేపీి సిద్ధపడితే మనం సంతోషించాలి, ఆహ్వానించాలి.అంతేగానీ కేవలం అంబేద్కర్‌ను పొగిడితే అది ఓట్ల వ్యూహంగానే భావించాలి.హిందూమతం ప్రజాస్వామిక విలువలకు చోటు ఇప్పుడు లేదని అంబేద్కర్‌ ఫిలాసఫి ఆఫ్‌ హిందూయిజంలో స్పష్టం చేశాడు. సాంఘిక న్యాయానికి తోడ్పడని హిందూమతాన్ని అమానుషమైనదిగా సహజంగానే అంబేద్కర్‌ నిర్ధారిం చాడు. బీజేపీ వారు అంబేద్కర్‌ తత్వాన్ని, వాదనల్ని ఏ మేరకు అంగీకరిస్తున్నారో,ఎక్కడ ఎందుకు నిరాకరిస్తున్నారో తెలపాలి. అంటరానితనం పోవాలని చిలుకపలుకులు ఉచ్ఛరిస్తే సరిపోదు.అంబేద్కర్‌ ను వాడుకుని ఓట్లు తెచ్చుకుందామనే బీజేపీ ఆలోచనల్ని దేశ ప్రజలు పసిగట్టి తిప్పికొట్టకపోతే నష్టపోయేది ప్రజలే.
నాదెండ్ల శ్రీనివాస్‌
9676407140

Spread the love