యాదయ్యను గెలిపించాలి

– సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పి.జంగారెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇబ్రహీంపట్నంలో సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి యాదయ్యను అత్యధిక మెజార్టీలో గెలిపించాలని రాష్ట్ర నాయకులు పి.జంగారెడ్డి పిలుపునిచ్చారు. పోచారం, ఉప్పరిగూడ గ్రామాల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కప్పాడు, కర్నంగూడ, తుర్కగూడ, చెర్లపటేల్‌గూడ, పోచారం, ఉప్పరిగూడ, నాగన్‌పల్లి, పోల్కంపల్లి గ్రామాల్లో ప్రజానాట్యమండలి కళాకారుల విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ బృందానికి సీఐటీయూ జిల్లానాయకులు బుగ్గరాములు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా జంగారెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టులను గెలిపించటం ద్వారానే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో అవకాశవాద, డబ్బు రాజకీయాలకు పాల్పడుతున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. నేటి పరిస్థితుల్లో చట్టసభల్లో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉంటే కార్మికుల, రైతుల, వ్యవసాయ కార్మికుల, మహిళలు, వత్తిదారులు, విద్యార్థి, యువజనుల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. చట్ట సభల్లో కమ్యూనిస్టులు లేకపోవడం వల్ల పేదలపై అనేక భారాలు పడుతున్నాయన్నారు. వాటిని ప్రశ్నించే వారే కరువయ్యారన్నారు. అందుకే ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థి యాదయ్యకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల నాయకులు రామకృష్ణారెడ్డి, పంది జంగయ్య, టి నర్సింహ, ప్రజానాట్య మండలి కళాకారులున్నారు.

Spread the love