లైంగిక వేధింపుల నిరోధానికి కలిసి పనిచేయాలి


– పోక్సో చట్టం వయస్సుపై
సమ్మతికి పార్లమెంట్‌ చట్టం చేయాలి
– సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌
న్యూఢిల్లీ : దేశంలో మౌన సంస్కృతి ఉన్నందున… చిన్నారులపై లైంగిక వేధింపులు ఓ దాగి వున్న సమస్యగా మిగిలిపోయిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ అన్నారు. పిల్లలపై లైంగిక వేధింపులు జరగకుండా నిరోధించడానికి కార్యనిర్వా హక, న్యాయవ్యవస్థ కలిసి పని చేయాలని చెప్పారు. నేరస్థుడు కుటుం బ సభ్యుడైనప్పటికీ ఈ ఘాతుకాన్ని నివేధించటానికి కుటుంబాలను ప్రభుత్వం ప్రోత్సహించాలని సూచించారు. యునిసెఫ్‌తో కలిసి జువైనల్‌ జస్టిస్‌పై సుప్రీంకోర్టు కమిటీ నిర్వహిస్తున్న లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించడం (పోక్సో) చట్టంపై జాతీయ భాగస్వామ్య సంప్రదింపుల రెండు రోజుల సమావేశాన్ని సీజేఐ జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ శనివారం ప్రారంభించారు. నేర న్యాయ వ్యవస్థ పనితీరు కొన్నిసార్లు నాటకీయత, బాధితుల బాధలను సమ్మిళితం చేయడం, బాధితుల గాయాన్ని పెంచడం దురదృష్టకరమనీ, అందువల్ల ఇది జరగకుండా నిరోధించడానికికార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ చేతులు కలపాలని సూచించారు.
పిల్లల ప్రయోజనాల కంటే కుటుంబ గౌరవం ఎక్కువ కాదు
‘చిన్నారుల లైంగిక వేధింపుల దీర్ఘకాలిక చిక్కులు, పిల్లల లైంగిక వేధింపుల నివారణ, దానిని సకాలంలో గుర్తించడం, చట్టంలో అందుబాటులో ఉన్న నివారణకు సంబంధించి రాష్ట్ర, ఇతర వాటాదారులకు అవగాహన కల్పించడం అత్యవసరం. చిన్నారులకు సు రక్షితమైన స్పర్శ, అసురక్షితమైన స్పర్శ మధ్య వ్యత్యాసాన్ని నేర్పించాలి. ఇది గతంలో మంచి స్పర్శ, చెడు స్పర్శగా సూచించబడినప్పటికీ, పిల్లల హక్కుల కార్యకర్తలు సురక్షిత, అసురక్షిత పదాన్ని తల్లిదండ్రులు ఉపయోగించాలి. ఎందుకంటే మంచి, చెడు అనే పదం నైతిక ప్రభావాలను కలిగి ఉంటుంది’ అని తెలిపారు. అన్నింటికీ మించి, పిల్లల ఉత్తమ ప్రయోజనాల కంటే కుటుంబం గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వ కుండా చూసుకోవడం తక్షణ అవసరమని అన్నారు. నేరస్థుడు కుటుం బ సభ్యుడిగా ఉన్నప్పటికీ,ఘాతుకం గురించి నివేదించడానికి తప్పనిస రిగా కుటుంబాలను ప్రోత్సహించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.
వయస్సుపై చట్టం చేయాలి
పోక్సో చట్టం ప్రకారం సమ్మతి వయస్సు గురించి పెరుగుతున్న ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలని పార్లమెంట్‌ను కోరారు. ‘మైనర్లలో వాస్తవంగా సమ్మతి ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా పోక్సో చట్టం 18 ఏళ్లలోపు వారి మధ్య జరిగే అన్ని లైంగిక చర్యలను నేరంగా పరిగణిస్తుంది. ఎందుకంటే 18 ఏళ్లలోపు వారిలో సమ్మతి అవసరం లేదని చట్టం చెబుతోంది’ అని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధిత కుటుంబాలు వెనుకాడుతున్నాయనీ, కాబట్టి పోలీసులకు మితిమీరిన అధికారాలు అప్పగించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సీజేఐ అన్నారు. ‘నేర న్యాయ వ్యవస్థ నెమ్మదిగా సాగడం నిస్సందేహంగా దీనికి కారణాలలో ఒకటి. కానీ ఇతర అంశాలు కూడా ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన సమస్యలు అపారమైన కళంకంతో బాధపడుతూనే ఉన్నాయి. ఎందుకంటే నిశ్శబ్ద సంస్కృతి ఉంది. అవమానం, కుటుంబ గౌరవం వంటి భావనల నుండి వచ్చింది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి, సుప్రీం కోర్టు జువైనల్‌ జస్టిస్‌ కమిటీ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఎస్‌. రవీంద్ర భట్‌, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బివి నాగరత్న, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ, యునిసెఫ్‌ ఇండియా ప్రతినిధి సింథియా మెక్‌కాఫెరీ తదితరులు మాట్లాడారు.

Spread the love