శ్రీలంక అధ్యక్షుడి పర్యటనను అడ్డుకున్న ఆందోళనకారులు

నవతెలంగాణ – హైదరాబాద్
శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పర్యటను అడ్డుకోవడానికి జాఫ్నాలో స్థానికులు వినూత్నంగా నిరసన తెలిపారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో నుంచి బయటపడేసేందుకు అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలపై జనంలో నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం జాఫ్నా యూనివర్సిటీని సందర్శించేందుకు రణిల్ విక్రమసింఘే వస్తున్నారని తెలుసుకున్న జనం.. రోడ్లపై ఆందోళనకు దిగారు. అధ్యక్షుడి పర్యటనను అడ్డుకోవడానికి యువకులు ఆందోళన ప్రారంభించారు. ఈ ఆందోళనను అణచివేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకుని, యువకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, పోలీసుల సూచనలను ఆందోళనకారులు పట్టించుకోలేదు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించారు. ఆందోళనకారులు ముందుకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నీళ్లలో తడిసిన ఆందోళనకారులు కొంతమంది షాంపూలు తీసి తలంటుకుంటూ నిరసన వ్యక్తంచేశారు.

Spread the love