సాధన మొదలైంది

నాగ్‌పూర్‌ : ఆస్ట్రేలి యాతో బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ కోసం టీమ్‌ ఇండియా కసరత్తులు మొదలుపెట్టింది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో చోటు కోసం ఎదురుచూస్తున్న టీమ్‌ ఇండియా రానున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో మూడింట విజయాలు సాధించాల్సి ఉంది. అప్పుడే ఇతర సమీకరణాలతో నిమిత్తం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోగలదు. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో తొలి టెస్టు కోసం ఆస్ట్రేలియా క్రికెటర్లు బెంగళూర్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా.. రోహిత్‌సేన నాగ్‌పూర్‌కు చేరుకుని ప్రాక్టీస్‌లోకి దిగింది. శుక్రవారం ప్రాక్టీస్‌ సెషన్లో విరాట్‌ కోహ్లి, చతేశ్వర్‌ పుజారా, కెఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ సాధన చేశారు. స్పిన్‌ బౌలింగ్‌లో ఇబ్బందులు పడుతున్న విరాట్‌ కోహ్లి, చతేశ్వర్‌ పుజారా నెట్స్‌లో టర్నింగ్‌ బంతులపై ధ్యాస పెట్టారు. బౌలర్లు సైతం ఫుల్‌ స్వింగ్‌తో సాధన చేశారు. రవీంద్ర జడేజా పునరాగమనం కోసం కసరత్తు చేస్తుండగా.. శ్రేయస్‌ అయ్యర్‌కు గాయంతో సూర్యకుమార్‌ యాదవ్‌ టెస్టు అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాడు. వైట్‌బాల్‌ సిరీస్‌లతో బిజీగా గడిపిన భారత్‌.. స్వదేశీ సీజన్‌లో తొలిసారి టెస్టు క్రికెట్‌ సవాల్‌ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంది.

Spread the love