మాజీ ఎంపీ సహా పది మందికి జైలు శిక్ష

నవతెలంగాణ – కన్నౌజ్
యూపీలో మాజీ ఎంపీ రామ్‌ బక్ష్‌ వర్మ సహా పది మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. 2017లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో ఒక్కొక్కరికీ ఏడాది జైలు శిక్షతో పాటు రూ.3వేలు చొప్పున జరిమానా విధిస్తూ చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ ధర్మవీర్‌ సింగ్‌ తీర్పు వెలువరించారు. జైలు శిక్ష పడిన వారిలో మాజీ ఎంపీ తనయుడు సైతం ఉన్నారు. మాజీ ఎంపీ రామ్‌ బక్ష్‌ వర్మ గతంలో రెండు పర్యాయాలు (1994, 2006) రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. 1977లో జనతా పార్టీ నుంచి, 1989లో జనతాదళ్‌ నుంచి ఎమ్మెల్యేగానూ ఎన్నికయ్యారు. 2017లో నిర్వహించిన ఊరేగింపులో వర్మ మద్దతుదారులు పోలీసులతో గొడపడటంతో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ వర్మ, మరికొందరిపై 2017 జనవరి 25న తిర్వా పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసులో వర్మ సహా పది మందికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. వర్మ ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నారు.

Spread the love