నవతెలంగాణ ఢిల్లీ: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పలువురు రాజ్యసభ సభ్యులు లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఎగువ సభలో 10 స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ వివరాలను రాజ్యసభ సెక్రటేరియట్ అధికారికంగా వెల్లడించింది. 18వ లోక్సభకు ఎన్నికైన నేపథ్యంలో జూన్ 4 నుంచి వారి రాజ్యసభ సభ్యత్వం నిలిచిపోయినట్టు రాజ్యసభ సెక్రటేరియట్ తెలిపింది. రాజ్యసభ ఎంపీగా ఉంటూ పోటీ చేసి గెలిచిన పీయూష్ గోయల్కు వాణిజ్యం, పరిశ్రమలు, సర్బానంద సోనోవాల్కు నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా, జ్యోతిరాదిత్య సింధియాకు కమ్యూనికేషన్లు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, టెలికాం శాఖలు దక్కాయి. కామాఖ్య ప్రసాద్ తాసా, సర్బానంద సోనోవాల్ (అస్సాం), మీసా భారతి, వివేక్ కుమార్ (బిహార్), ఉదయన్రాజే భోంస్లే, పీయూష్ గోయల్ (మహారాష్ట్ర), దీపేందర్ సింగ్ హుడా (హర్యానా), కేసీ వేణుగోపాల్ (రాజస్థాన్), బిప్లబ్ కుమార్ దేబ్ (త్రిపుర), జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్)లు ఈ జాబితాలో ఉన్నారు. వీరంతా లోక్సభ ఎన్నికల్లో ఆయా స్థానాల నుంచి గెలుపొందారు. రాజ్యసభ సెక్రటేరియట్ నుంచి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో.. ఈ ఖాళీల భర్తీకి ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించనుంది.