ఘోర అగ్ని ప్రమాదం.. 26 మంది సజీవదహనం

నవతెలంగాణ హైదరాబాద్: చైనా (China)లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 26 మంది సజీవదహనం అయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లోని లిషి జిల్లాలో లియులియాంగ్‌ నగరంలో ఉన్న ఐదు అంతస్తుల భవనంలో ఓ ప్రయివేటు బొగ్గు గని సంస్థ కార్యాలయంలో ఈ ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం సుమారు ఏడు గంటల ప్రాంతంలో భవనం రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. అవి మిగిలిన అంతస్తులకు వ్యాపించడంతో సుమారు 90 మంది సిబ్బంది భవనం లోపల చిక్కుకుపోయారు. మంటల తీవ్రత పెరగడంతో భవనం లోపల ఉన్న వారిలో 26 మృతి చెందారు. మరో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రి తరలించాయి. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నట్టు స్థానిక అధికారులు తెలిపారు.

Spread the love