Wednesday, October 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసర్వే కోసం రూ.30వేలు లంచం డిమాండ్‌

సర్వే కోసం రూ.30వేలు లంచం డిమాండ్‌

- Advertisement -

ఏసీబీకి చిక్కిన సిరిసిల్ల సర్వేయర్‌
రూ.20వేలు తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టివేత


నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
మూడెకరాల భూమి సర్వే కోసం ఓ సర్వేయర్‌ లంచం తీసుకుంటుండగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాధితుడు, ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఇరుకుల్ల ప్రవీణ్‌కు సిరిసిల్ల మున్సిపల్‌ అర్బన్‌ పరిధిలోని 10వ వార్డు చిన్నబోనాలలో 123 సర్వే నెంబర్‌లో 3.32 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి సంబంధించిన సరిహద్దులు ఏర్పాటు చేయాలని రెండేండ్లుగా ఆయన సిరిసిల్ల రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఐదు నెలలుగా సిరిసిల్ల రెవెన్యూ కార్యాలయంలో సర్వేయర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వేణుగోపాల్‌ చుట్టూ కూడా తిరుగుతున్నాడు.

ఇటీవల భూమి సర్వే చేయడానికి సర్వేయర్‌ వేణు రూ.50వేలు డిమాండ్‌ చేయగా రూ.30వేలకు ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ప్రవీణ్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. మొదటగా సర్వే చేసిన రోజు వేణు రూ.10వేల లంచం తీసుకున్నాడు. సర్వే రిపోర్ట్‌ ఇవ్వడానికి మరో రూ.20వేలు తన ప్రయివేటు అసిస్టెంట్‌ సూర్యవంశీ మంగళవారం సిరిసిల్ల తహసీల్దార్‌ కార్యాలయంలో తీసుకుంటున్న క్రమంలో ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్‌ ఆధ్వర్యంలో అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సర్వేయర్‌ వేణుగోపాల్‌తో పాటు ప్రయివేటు అసిస్టెంట్‌ సూర్యవంశీను బుధవారం ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్టు డీఎస్పీ విజయ్ కుమార్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -