– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున
నవతెలంగాణ-నల్లగొండ టౌన్
ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండ మండలం రాములబండ గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సిపిఎం ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా పాలడుగు నాగార్జున మాట్లాడుతూ .. ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల ధాన్యం వడ్ల కొనుగోలు కేంద్రాల్లో పోశారనీ, అయితే నేటికీ ప్రభుత్వ యంత్రాంగం కొనుగోలు ప్రారంభించకపోవడం రైతాంగాన్ని తీవ్రంగా నిరాశపరుస్తోందని అన్నారు.
రైస్ మిల్లుల కేటాయింపు ఇప్పటికీ జరగలేదని, రైతులు మాచర్ వచ్చినప్పటికీ ధాన్యం కొనుగోలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో రైతులు నేరుగా రైస్ మిల్లులకు ధాన్యం ఇచ్చే పరిస్థితి ఏర్పడి, క్వింటాలుకు రూ.1600–1700 మాత్రమే ఇస్తూ మధ్యవర్తులు దోపిడీ చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే పత్తి పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, పెట్టుబడులు తిరిగి రాని పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. గతంలో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి బోనస్ ఇవ్వకపోవడం రైతులపై పెద్ద భారమని విమర్శించారు. “రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని, వెంటనే ధాన్యం కొనుగోలు చర్యలు ప్రారంభించి, రైస్ మిల్లులను కేటాయించి, బోనస్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, శ్రవణ, గోపాలు, వెంకన్న, మహిళలు మరియు రైతులు పాల్గొన్నారు.