Monday, October 20, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంస్వీట్‌లో సింథటిక్‌

స్వీట్‌లో సింథటిక్‌

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా మిఠాయి తయారీ కేంద్రాలు, షాపుల్లో తనిఖీలు
234 నమూనాలనుసేకరించిన ఫుడ్‌ సేఫ్టీ అధికారులు
రిజిస్ట్రేషన్‌ ఉన్న షాపుల్లోనే కొనుగోలు చేయాలని సూచన


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రవ్యాప్తంగా 95 స్వీట్ల తయారీ కేంద్రాలు, షాపుల్లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా దాదాపు వంద కేజీల కల్తీ ఆహారాన్ని సీజ్‌ చేశారు. దీపావళి పండుగ నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దష్టిలో ఉంచుకుని ఏకకాలంలో 33 జిల్లాల్లో చేపట్టిన తనిఖీల్లో అనేక లోపాలను కనుగొన్నారు. ఈ తనిఖీల్లో కొన్ని చోట్ల వీటి తయారీకి నిషేధిత పదార్థాలను వినియోగించడం, గడువు తీరిన ఉత్పత్తులుండటాన్ని గుర్తించారు. ఎక్కువగా మిల్క్‌ తో తయారు చేసే జిలేబీ, లడ్డు తదితర వాటిలో ఎక్కువగా సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌ను వాడుతూ ఫుడ్‌ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించినవే ఉన్నాయి.

స్వీట్ల తయారీలోనూ కల్తీ నెయ్యి, వాడిన వంట నూనెలను తిరిగి ఉపయోగిస్తున్నట్టు నిర్ధారించారు. కొన్ని చోట్ల వెంటి రేకును పెట్టడం, తయారీ, అమ్మకాల ప్రాంగణాలు పరిశుభ్రంగా లేకపోవడం ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్ల దృష్టికి వచ్చింది. లేబుల్‌ చేయనీ, గడువు తీరిన వాటిని కూడా అమ్ముతున్నట్టు గుర్తించారు. అధికారులు 60 కేజీల స్వీట్స్‌, 40 కేజీల బ్రెడ్స్‌ , ఇతర కల్తీ ఆహారంగా అనుమానించిన వాటి సేకరించి వారికి నోటీసులు జారీ చేశారు. 234 నమూనాలను పరీక్షల కోసం ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబోరేటరీకి పంపించారు. కొన్ని చోట్ల ఫుడ్‌ సేప్ఠీ వీల్స్‌ అందుబాటులో ఉండటంతో ఆహార నాణ్యతపై అక్కడికక్కడే తనిఖీ నిర్వహించారు. ల్యాబ్‌ లకు పంపించిన నమూనాలపై రిపోర్ట్‌ వచ్చాక తదుపరి ఫుడ్‌ సేఫ్టి నిబంధనల మేరకు చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు తెలిపారు.

కొనుగోలు చేసే ముందు…
ఫుడ్‌ సేప్ఠీ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆప్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) రిజిస్ట్రేషన్‌ ఉన్న షాపుల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని వినియోగదారులకు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు సూచించారు. ఆయా షాపుల్లో ఫుడ్‌ సేఫ్టీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌ను అందరికి కనిపించేలా పెట్టాలని సూచించారు. కొనుగోలు చేసే ముందు సరైన ప్యాకేజింగ్‌, తయారీ తేదీ, గడువు తీరే తేదీ తప్పనిసరి చూడాలని ప్రజలను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -