Thursday, October 23, 2025
E-PAPER
Homeజిల్లాలుజాబ్ మేళాకు ఎక్కువ సంఖ్యలో యువత హాజరయ్యేలా చూడాలి..

జాబ్ మేళాకు ఎక్కువ సంఖ్యలో యువత హాజరయ్యేలా చూడాలి..

- Advertisement -

మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్..

గ్రామ పాలనాధికారులు,గ్రామ పోలీసు అధికారులు గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత ఈ నెల 25న సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో నిర్వహించే మెగా జాబ్ మేళాకు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల ,పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. సమాజంలో అతిపెద్ద సమస్యగా మారిన నిరుద్యోగ సమస్యను తమవంతుగా కొంతవరకైన తీర్చాలన్న ఉద్దేశంతో ఉమ్మడి నల్గొండ జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించే నిమిత్తం హుజూర్నగర్ లో ఈ నెల 25 న్స్ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఆర్డీవోలు, తహసిల్దార్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఎంపిడిఓలు, గ్రామ పాలనాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పోలీసు అధికారులతో జాబ్ మేళా పై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులు పిల్లల్ని కష్టపడి చదివిస్తున్నప్పటికీ ఉద్యోగావకాశాలు సరిగా లేకపోవడం, అవగాహన లేకపోవడం వల్ల వారికి ఉద్యోగ అవకాశాలు సరిగా రావడంలేదని, దీన్ని దృష్టిలో ఉంచుకొని తమ వంతు ప్రయత్నం గా కొంతవరకైనా నిరుద్యోగ సమస్యను తీర్చాలన్న ఉద్దేశంతో సింగరేణి కాలరీస్ ,డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ సంయుక్త సహకారంతో 25న హుజూర్నగర్ లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు.

250 వరకు కంపెనీలు ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొననున్నాయని, గ్రామీణ ప్రాంతానికి వెళ్లి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో కంపెనీలు హుజూర్నగర్ కు వస్తున్నట్లు తెలిపారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు,గ్రామ పాలనాధికారులు, గ్రామ పోలీసు అధికారులు గ్రామంలోని నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో జాబ్ మేళాకు హాజరయ్యే విధంగా చూడాలని కోరారు. రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీలన్ని మన గడప దగ్గరకే వస్తున్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు .ఇప్పటివరకు ఈ జాబ్ మేళాకు 12500 మంది రిజిస్టర్ చేసుకోగా, క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా యువతను ప్రోత్సహించాలని, జిల్లాలోని అన్ని గ్రామాలకు జాబ్ మేళాకు సంబంధించిన వాల్ ఫోస్టర్లు పంపించడం జరుగుతుందని తెలిపారు.

అభ్యర్థులు 5 కాపీల రెజ్యూమ్ తో పాటు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకొని జాబ్ మేళాకు రావాలని,జాబ్ మేళా నిర్వహించే పెర్ల్ ఇన్ఫినిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో హెల్ప్ డెస్క్ లు, రిజిస్ట్రేషన్ డేస్క్ లు ఏర్పాటు చేస్తున్నామని, అంతేకాక జాబ్ మేళా కు హాజరయ్యే నిరుద్యోగులకు స్వర్ణ వేదిక ఫంక్షన్ హాలులో ఉదయం అల్పాహారం,మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫిన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నిరుద్యోగ యువతకు మేలు చేయాలన్న దృఢ సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. జాబ్ మేళాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన బందోబస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ నరసింహను మంత్రి ఆదేశించారు.

అదేవిధంగా జాబ్ మేళాకు హాజరయ్యే వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, మినిస్టర్ ఓఎస్డి ప్రవీణ్,అదనపు కలెక్టర్ కె .సీతారామారావు, ప్రజాప్రతినిధులు సరోత్తం రెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, కొప్పుల వేణారెడ్ది, పోతుల భాస్కర్, చింతల లక్ష్మి నారాయణ రెడ్డి, చకిలం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -