38 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ కంచె
నవతెలంగాణ-సిటీబ్యూరో
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పేట్బషీరాబాద్లో జర్నలిస్టులకు కేటాయించిన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. సర్వే నంబరు 25/2లోని 38 ఎకరాల భూమి చుట్టూ బుధవారం ఫెన్సింగ్ వేసింది. 2008లో రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచ్యువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి కేటాయించింది. ఈ భూమిని జర్నలిస్టులకు కేటాయిస్తూ హెచ్ఎండీఏ కస్టడీలో ప్రభుత్వం ఉంచిన విషయం విదితమే. అయితే, ఈ కేటాయింపులపై కొంతమంది కోర్టుకెళ్లడంతో అక్కడ జర్నలిస్టులకు ప్లాట్ల పంపిణీ జరగలేదు. కోర్టులో కేసు నడుస్తుండగానే.. మరోవైపు అక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయని ఆ యూనియన్ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై అక్కడ రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులు కూడా హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండీఏ అధికారులతో కలిసి హైడ్రా క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. ఆక్రమణలు జరిగినట్టు నిర్ధారించుకుంది. ఇప్పటికే కొంతమంది ఇండ్లు కట్టుకుని ఉండగా, వాటి జోలికి వెళ్లకుండానే ఇంకా ఖాళీగా ఉన్న భూమి చుట్టూ బుధవారం ఫెన్సింగ్ వేసింది. ఈ విషయమై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేయగా కోర్టు తీర్పు ప్రకారం ఆ స్థలం కేటాయింపులు జరుగుతాయని, ఈ లోగా ఆక్రమణలు జరగకుండా ప్రభుత్వ భూమిని కాపాడుతున్నట్టు హైడ్రా స్పష్టం చేసింది. అలాగే అక్కడ ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారితో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో రికార్డులను పరిశీలిస్తామని హైడ్రా కమిషనర్ చెప్పారు. ఈ సమావేశంలో హైడ్రా, రెవెన్యూ, హెచ్ ఎండీఏ, మున్సిపల్ అధికారులు కూడా ఉంటారని తెలిపారు.
జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని కాపాడిన హైడ్రా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES