ఇతర సమస్యలను పరిష్కరిస్తాం : గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల వర్కర్లకు మంత్రి లక్ష్మణ్ హామీ
సమ్మె విరమించాలని సూచన
తాత్కాలికంగా విరమిస్తున్నట్టు జేఏసీ ప్రకటన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లకు తగ్గించిన వేతనాలను తిరిగి చెల్లిస్తామనీ, పీఎంహెచ్ వర్కర్లకు జీవో 60ప్రకారం వేతనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. విద్యార్థుల సౌకర్యం కోసం సమ్మెను విరమించాలని ఆయన సూచించారు. దీంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల డైలీవేజ్ కార్మికుల జేఏసీ నేతలు ప్రకటించారు. డైలీ వేజ్, పీఎంహెచ్ వర్కర్లకు వేతనాలు తగ్గించిన జీవో 64 , 527ల అమలు నిలిపివేయాలనీ, డైలీ వేజ్ వర్కర్లకు టైం స్కేల్ ఇవ్వాలనీ, పీఎంహెచ్ వర్కర్లకు జివో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం 2025 సెప్టెంబర్ 12 నుండి గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న వర్కర్లు నిరవధికంగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.
సీపీఐ(ఎం) మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి జోక్యంతో బుధ, గురువారాల్లో హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో మంత్రితో వర్కర్ల సమక్షంలో చర్చలు జరిగాయి. వేతనాల తగ్గింపు సమస్య, టైం స్కేల్ అమలు, జీవో 60 ప్రకారం పీఎంహెచ్ వర్కర్లకు వేతనాలు పూర్తి కాలం పనిచేస్తున్న కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లింపుతో పాటు సెలవులలో కార్మికులకు వేతనాలు చెల్లించటం, చనిపోయిన వర్కర్ల కుటుంబ సభ్యులకు ఉపాధి, ప్రమాద బీమా తదితర డిమాండ్లపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్కుమార్ మాట్లాడుతూ తగ్గించిన వేతనాలను తిరిగి చెల్లిస్తామనీ, దీనికోసం ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి, అధికారులతో చర్చించామని తెలిపారు.
టైం స్కేలు సమస్యపై చర్చలు జరుగుతున్నాయనీ, జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లింపు, టైం స్కేలు ఇతర అన్ని రకాల సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలనీ, త్వరలో అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చర్చలలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రితో పాటు గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్ల డైలీవేజ్ వర్కర్ల, యూనియన్ల రాష్ట్ర జేఏసీ నాయకులు బి మధు, మాడె పాపారావు, కే బ్రహ్మచారి, లక్ష్మణ్, జలంధర్, బి నాగేశ్వరరావు, వీరులాల్, శ్రీను, నాగలక్ష్మి, సౌందర్య, నాగలక్ష్మి, శంకర్, రమేశ్, సురేందర్, భరత్, రామ్ జి మోహన్, స్వామి, ముత్తమ్మ, సరళ, మోహన్, సుబ్బారావు, రవి, రాజేందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సమ్మె తాత్కాలిక విరమణ మరో రూపంలో ఆందోళన కొనసాగిస్తాం
సమ్మెను తాత్కాలికంగానే విరమిస్తున్నామనీ. విధులకు హాజరవుతూ టైం స్కేలు, అలాగే జీవో నెంబర్ 60 ప్రకారం పీఎంహెచ్ వర్కర్లకు వేతనాలతో సహా ఇతర అన్ని డిమాండ్లను పరిష్కరించేంతవరకు మరో రూపంలో ఆందోళన కొనసాగిస్తామని కార్మికుల జేఏసీ నాయకత్వం ప్రకటించింది.



