Friday, October 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్‌ హయాంలోనే యువతకు ఉద్యోగాలు

కాంగ్రెస్‌ హయాంలోనే యువతకు ఉద్యోగాలు

- Advertisement -

నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయండి
రిజిస్ట్రేషన్‌ శాఖలో కొత్తగా 14 మంది సబ్‌ రిజిస్ట్రార్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా గ్రూప్‌-2 నియామకాల్లో ఎంపికై స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో సబ్‌ రిజిస్ట్రార్లుగా నియమితులైన 14మంది అధికారులు గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిని మంత్రి అభినందించారు. నూతన సబ్‌ రిజిస్ట్రార్లకు ఇండియన్‌ స్టాంప్‌ యాక్ట్‌ బుక్‌లను తన చేతుల మీదుగా ఇచ్చారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ.. దశాబ్ద కాలంలో నిరుద్యోగ యువత కన్న కలలు కల్లలై పోయాయనీ, ఉద్యోగాల నియామక ప్రక్రియలో గత ప్రభుత్వం చూపించిన అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగుల ఆశలు అడుగంటిపోయాయని విమర్శించారు. ఆనాటి ప్రభుత్వం చేపట్టిన అరకొర ఉద్యోగ నియామక ప్రక్రియల్లో చోటు చేసుకున్న అక్రమాలు, పేపర్‌ లీకేజీలు, అసమర్థ పరీక్షా నిర్వహణ వల్ల అర్హులైన యువతకు ఉద్యోగాలు రాని పరిస్ధితి దాపురించిందన్నారు.

ఈ పరిస్థితుల్లో ఇందిరమ్మ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. 20 నెలల పాలనా కాలంలో ఇప్పటి వరకు సుమారు 70 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న ఆలోచన మేరకు వివిధ శాఖల తరపున కార్యాచరణను విస్తృతం చేశామన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రెవెన్యూ శాఖలో జీపీవోల నియామకం, హౌసింగ్‌ విభాగంలో ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో దాదాపు 350 మంది ఇంజినీర్లు, సర్వే విభాగంలో 3465 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు ఉపాధి అవకాశాలు కల్పించామని వివరించారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే అధికారులు సామాన్య ప్రజలే లక్ష్యంగా సేవలు అందించాలని సూచించారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుందనీ, ఎటువంటి ప్రలోభాలకు తలొగ్గకుండా నిజాయితీ, నిబద్ధత అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసి ప్రభుత్వ పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని కోరారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్‌ సంతోష్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -